ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వాన... హైదరాబాద్ సహా తెలంగాణలో... ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం...
శుక్రవారం(సెప్టెంబర్ 25) సాయంత్రం నుంచి హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో రాత్రంతా అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సికింద్రాబాద్,ఆర్టీసీ క్రాస్ రోడ్,హిమాయత్ నగర్,అంబర్పేట్,ఉప్పల్,మాదాపూర్,బంజారాహిల్స్,హైటెక్సిటీ,కేపీహెచ్బీ, లింగంల్లి పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్.నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఎంత...
హైదరాబాద్లో శనివారం(సెప్టెంబర్ 26) ఉదయం కూడా వర్షం ఎడతెరిపినివ్వకపోవడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. హైదరాబాద్ శివారులోని హస్తినపురంలో 9.8 సెం.మీ వర్షపాతం,కందికల్ గేట్ 7.2 సెం.మీ వర్షపాతం, సరూర్నగర్లో 6.8 సెం.మీ, చార్మినార్ 6.8 సెం.మీ, చాంద్రాయణగుట్ట 6.5 సెం.మీ, మారేడుపల్లి 6.4 సెం.మీ, ఎల్బీనగర్ 6.4 సెం.మీ, తార్నాక 5.9 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. కర్మాన్ ఘాట్ నుంచి సరూర్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిలో నడుము లోతు వరకు నీళ్లు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
జిల్లాల్లో పరిస్థితి...
రంగారెడ్డి జిల్లా నందిగామలో అత్యధికంగా 18.3 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. కొత్తూర్లో 14.3 సెం.మీ., ఫరూక్నగర్లో 14.3 సెం.మీ.,షాద్నగర్లో 13.5 సెం.మీ., షాబాద్లో 12 సెం.మీ వర్షపాతం, హయత్నగర్లో 9.8 సెం.మీ., శంషాబాద్లో 9.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 17.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 15.5 సెం.మీ., వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో 13.9 సెం.మీ., సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 13.8 సెం.మీ., సిద్దిపేట జిల్లా వర్గల్లో 13.4 సెం.మీ., వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో 13.3 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది.
వికారాబాద్,మహబూబ్నగర్...
వికారాబాద్,మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ శుక్రవారం నుంచి ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. వికారాబాద్ జిల్లాల్లో వర్షపు నీటికి కోట్పల్లి, శివసాగర్ చెరువు, సర్పంపల్లి, లక్నాపూర్ ప్రాజెక్టులు అలుగు దుంకుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాల్లో నిన్నటి నుంచి కురుస్తున్న వానలకు పలు గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. పెద్దవంగర మండలం గండ్లకుంటలో వాన నీరు భారీగా వీధుల్లోకి,ఇళ్లల్లోకి చేరింది.
Recommended Video
దక్షిణ తెలంగాణకు వర్ష సూచన...
కర్ణాటక మీదుగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాబోయే 24గంటల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ద్రోణి ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.