భారీ వర్షాలు-వరదలు: పానీపూరి కోసం వెళ్లి ఇద్దరు యువకులు మృతి, 8 మంది గల్లంతు
హైదరాబాద్: భారీ వర్షాలు హైదరాబాద్ తోపాటు పరిసర జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో సుమారు 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. కాగా, రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లిలోని అలీనగర్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్ వర్షాలు-వరదలు: సెల్లార్లో నీటిని తోడే ప్రయత్నంలో వైద్యుడు మృతి
ఒకే కుటుంబంలోని 8 మంది గల్లంతు
భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద నీటిలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది గల్లంతయ్యారు. కాగా, పల్లె చెరువుకు భారీగా వరదనీరు చేరుతుండటంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో పల్లెచెరువు దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మైకుల ద్వారా ప్రజలకు సూచిస్తున్నారు. పల్లె చెరువుకు గండిపడకుండా చర్యలు చేపట్టారు. పల్లెచెరువు వరద బాధితుల కోసం ఫంక్షన్ హాలులో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. కాగా, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ అలీనగర్ లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు.
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేత
భారీ వర్షాల కారణంగా అప్ప చెరువు పొంగిపొర్లుతుండటంతో గగన్ పహాడ్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. బుధవారం రాత్రి రహదారి కోతకు గురవడంతో మట్టిలో కూరుకుపోయిన వాహనాలను బయటకు తీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
పానీపూరి కోసం వెళ్లి వాగు వరదలో ఇద్దరు యువకులు మృతి
ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ట్ మండలం ఇంజపూర్ వాగులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. తుర్కయంజాల్ మున్సిపాల్టీ పరిధిలోని తొర్రూరు గ్రామం రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన ప్రణయ్(19), ప్రదీప్(16)గా గుర్తించారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో తొర్రూరు నుంచి ఇంజపూర్ వెళ్లారు. పానీపూరి కోసమంటూ ఇంటి నుంచి వెళ్లిన యువకులు.. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే ప్రయత్నంలో వరదనీటిలో కొట్టుకుపోయారు. రెండ్రోజుల తర్వాత యువకుల మృతదేహాలను వెలికితీశారు పోలీసులు. వారి మృతదేహాలను ఉస్మానియా మార్చూరీకి తరలించారు. ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.