హేమంత్ను చంపినవాళ్లను ఎన్కౌంటర్ చేయండి..కడుపులో ఇంత విషం ఉందనుకోలేదు..బోరున విలపించిన భార్య,తల్లి.
హైదరాబాద్లో హేమంత్ అనే యువకుడి పరువు హత్య తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుందన్న కారణంతో తండ్రి యువకుడిని కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు. హత్యపై హేమంత్ భార్య అవంతి మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు.తన మేనమామతో కలిసి మరో ఇద్దరు హేమంత్ను హత్య చేశారని ఆరోపించారు. తన తండ్రి ఇంత దారుణానికి ఒడిగడుతాని ఊహించలేదంటూ కన్నీరుమున్నీరయ్యారు.
హైదరాబాద్లో పరువు హత్య.. ప్రణయ్ హత్య లాగే...కిరాయి మనుషులతో అల్లుడిని చంపించిన మామ
అవంతి మాటల్లో...
'చందానగర్కు చెందిన మేమిద్దరం 8 ఏళ్లుగా ప్రేమించుకున్నాం. అయితే పెళ్లికి మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఈ ఏడాది జూన్లో వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే తల్లిదండ్రులతో రాజీ కుదిరింది. నాతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆరోజే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మా నాన్నకు రాసిచ్చేశాను.' అని అవంతి చెప్పారు.
'గురువారం(సెప్టెంబర్ 24) మధ్యాహ్నం మా మేనమామతో పాటు మరికొందరు గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉన్న మా ఇంట్లోకి చొరబడ్డారు. మా ఇద్దరిని కిడ్నాప్ చేసి కారులో తరలించారు. మార్గమధ్యలో ఓఆర్ఆర్ వద్ద నేను కిందకు దూకేశాను. అదే సమయంలో హేమంత్ను కూడా కిందకు లాగడంతో అతను కూడా కిందపడ్డాడు. అయితే వెనకాలే వచ్చిన కిడ్నాపర్లు హేమంత్ను దారుణంగా కొట్టుకుంటూ మళ్లీ కారులో ఎక్కించారు. నేను అక్కడినుంచి పారిపోయి 100కి కాల్ చేశాను.' అని తెలిపారు.
హేమంత్ను చంపినవాళ్లను ఎన్కౌంటర్ చేయండి...
అయితే పోలీసులు దాదాపు 40 నిమిషాల వరకు స్పందించలేదని అవంతి అన్నారు. ఇవాళ ఉదయం హేమంత్ మృతదేహం దొరికినట్లు పోలీసులు తమకు సమాచారం ఇచ్చారన్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదన్నారు. మిర్యాలగూడలో ప్రణయ్ను హత్యను చేసిన మారుతీరావు చివరకు ఏమయ్యారో అందరం చూశాం... హేమంత్ను చంపినవాళ్లను ఎన్కౌంటర్ చేయాలి. నన్ను ప్రేమించేవాళ్లయితే హేమంత్ను ఎలా చంపుతారు. మా తల్లిదండ్రులతో కలుపుతారని అనుకున్నాం... కానీ నమ్మించి మోసం చేశారు... నావల్లే ఇదంతా జరిగింది... అసలు నేనే లేకుంటే హేమంత్ బతికే ఉండేవాడు... అని అవంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కులం కారణంగానే హత్య...
కేవలం కులం కారణంగానే తన బిడ్డను హత్య చేశారని హేమంత్ తల్లి లక్ష్మీ కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుక్కి ఒక్క చెడు అలవాటు కూడా లేదని... కనీసం గట్టిగా మాట్లాడటం కూడా తెలియదని అన్నారు. అవంతిని దాదాపు 7 నెలలు హౌజ్ అరెస్ట్ చేశారని... జూన్ 10న ఎలాగోలా ఇంటి నుంచి బయటపడి ఆమె హేమంత్ను కలిసిందని చెప్పారు. అదే రోజు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని... ఆ సంగతి తమకు కూడా తర్వాతే తెలిసిందన్నారు. తల్లిదండ్రులకు చెప్పే పెళ్లి చేసుకోవాలని అవంతికి చెప్పామని... కానీ వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారని తెలిపారు. కానీ కడుపులో వాళ్లు ఇంత విషం పెట్టుకున్నారని ఊహించలేదన్నారు.
హేమంత్ తండ్రి ఆవేదన...
ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఓ దెబ్బ కొడుతారేమో అనుకున్నా గానీ ఇంత దారుణంగా హత్యకు పాల్పడుతారనుకోలేదని హేమంత్ తండ్రి చింతా బోరున విలపించారు. ఈ కేసులో ఇప్పటివరకూ 13 మందిని అరెస్టు చేశారు. యువతి తండ్రి లక్ష్మారెడ్డి,బంధువులదే ఈ హత్యలో కీలక పాత్ర అన్నారు. పోలీసులు అలసత్వం ప్రదర్శించారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. కేసుపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.