కూకట్ పల్లిలో జూపూడి ఇంటి దగ్గర హైడ్రామా.. టీఆర్ఎస్ నేతల ధర్నా.. 17.50 లక్షలు స్వాధీనం
హైదరాబాద్ : మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక అసలు కథకు తెర తీశారు కొందరు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అదలావుంటే ఏపీకి చెందిన కీలకనేత ఇంటి దగ్గర బుధవారం రాత్రి చోటుచేసుకున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. కరెన్సీ కట్టలు పెద్దమొత్తంలో తీసుకొచ్చారనే టీఆర్ఎస్ నేతల ఆరోపణలతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఇంటి దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. బుధవారం రాత్రి 9-10 గంటల మధ్య టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా పెద్దఎత్తున డబ్బులు పంచేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
అసలేం జరిగింది?
ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు కూకట్ పల్లిలోని బాలాజీనగర్ లో నివాసముంటున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేతలు అలర్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాకూటమితో పొత్తుపెట్టుకున్న టీడీపీ.. ఓటర్లను ప్రభావితం చేస్తుందేమోనని భావించి ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. అదేక్రమంలో బుధవారం రాత్రి 9-10 గంటల ప్రాంతంలో జూపూడి ఇంటి దగ్గర ఓ ఇన్నోవా కారులోంచి ముగ్గురు వ్యక్తులు దిగడంతో అనుమానమొచ్చి పోలీసులకు ఫోన్ లో సమాచారం ఇచ్చారట.
17.50 లక్షలు స్వాధీనం..!
తాము ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకోవడంతో.. ఆ ముగ్గురు జూపూడి ఇంటి వెనుక గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు. దీంతో వారిని తాము వెంబడించడంతో ఒకరు దొరికారని.. మరో ఇద్దరు పారిపోయారని అంటున్నారు. తమకు పట్టుబడ్డ వ్యక్తి బ్యాగులో 17 లక్షల 50వేల రూపాయలు ఉన్నాయన్నారు. ఆ నగదుతో పాటు పట్టుబడ్డ వ్యక్తిని పీఎస్ కు తరలించినట్లు తెలిపారు పోలీసులు.
ఓటర్ల కోసమే ఈ డబ్బులు..! టీఆర్ఎస్ నేతల ఆరోపణ
జూపూడి ఇంటి దగ్గర డబ్బు పట్టుబడ్డ నేపథ్యంలో పారిపోయిన మరో ఇద్దరి దగ్గర భారీ ఎత్తున నగదు ఉండొచ్చని అనుమానించారు టీఆర్ఎస్ నేతలు. దీంతో ఆయన ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా ఈ డబ్బు వినియోగించేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. అదలావుంటే ఈ ఎపిసోడ్ పై జూపూడి ఇంకా స్పందించలేదు. డబ్బుతో పట్టుబడ్డాడని చెబుతున్న వ్యక్తి వారి మనిషేనా అన్నది కూడా పోలీసులు ధృవీకరించలేదు. మొత్తానికి దర్యాప్తులో అసలు విషయాలు బయటపడే అవకాశముంది.