టీ పీసీసీ చీఫ్ రేసులో ఉన్నా.. తన పేరును హైకమాండ్ పరిశీలిస్తోంది, జగ్గారెడ్డి హాట్ కామెంట్స్..
టీ పీసీసీ పోస్ట్ ఖాళీగా ఉంది. ఉత్తమ్ రాజీనామా తర్వాత మరో కొత్త నేతను ఏఐసీసీ ప్రకటించలేదు. ఉత్తమ్ రాజీనామాను కూడా ఆమోదించలేదు. దీంతో పీసీసీ చీఫ్ కసరత్తుపై ఉత్కంఠ నెలకొంది. కానీ ఈ లోపు చాలా మంది నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే తాను కూడా రేసులో ఉన్నానని జగ్గారెడ్డి అంటున్నారు. దీంతో కొత్త సారథ్య బాధ్యతలను ఎవరికీ అప్పగిస్తారనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
రేసులో నేను ఉన్నా..
ఉత్తమ్ రాజీనామా తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి చడీ చప్పుడు లేదు. దీంతో ఆశావాహుల జాబితా పెరుగుతోంది. రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు అనే పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా తాను కూడా రేసులో ఉన్నానని సంకేతాలను ఇచ్చారు జగ్గారెడ్డి. తన పేరును హై కమాండ్ పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.. కానీ
పీసీసీ అధ్యక్షుడి కోసం కసరత్తు జరుగుతోందని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే మందు తన వద్ద ఉందని చెప్పుకొచ్చారు. పీసీసీ అధ్యక్షుడికి డబ్బులు ఉండాలనేది ఒక తప్పుడు అభిప్రాయం అని కొట్టిపారేశారు. కానీ అదీ నిజం కాదని చెప్పారు. కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ తమలో ఐక్యత మాత్రం దెబ్బతినదని స్పష్టం చేశారు.
కార్పొరేట్కు కొమ్ముకాస్తూ..
పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జగ్గారెడ్డి. కార్పొరేట్కు కొమ్ముకాస్తోందని విమర్శించారు. రైతులను నాశనం చేసే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని చెప్పారు. అంబానీ, అదానీ, అమెజాన్కు లాభం చేయడానికే కొత్త చట్టం అమల్లోకి తెచ్చారని ఆరోపించారు. దీంతో రైతులు లేకుండా పోతారని అభిప్రాయపడ్డారు. రైతు సంఘాల భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు.
హైవే దిగ్బంధం..
బాంబే హైవేను దిగ్బంధం చేస్తున్నామని జగ్గారెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి హైపై తాను నిరసన తెలుపుతానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారని వివరించారు. అసెంబ్లీని సమావేశ పరిచి వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై రాజీలేకుండా పోరాడుతామని స్పష్టం చేశారు.
ఓడిపోవడంతో..
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయ్యింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నెల 4వ తేదీ (శుక్రవారం) ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవీకి రాజీనామా చేశారు. దీంతో కొత్త అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠ నెలకొంది. దీనికి తగ్గట్టు నేతలు కూడా.. తమ శక్తి మేరకు లాబీయింగ్ చేస్తున్నాయి. అయితే ఇవాళ తాను రేసులో ఉన్నానని జగ్గారెడ్డి స్వయంగా ప్రకటించారు.