రవిప్రకాశ్కు మరో ఎదురుదెబ్బ : బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నో
హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించిన ధర్మాసనం .. ఇవాళ విచారించింది. కేసు పూర్వపరాలు పరిశీలించి రవిప్రకాశ్కు బెయిల్ ఇచ్చేందుకు మరోసారి నిరాకరించింది.
ఫోర్జరీ కేసు ..
టీవీ 9లో ఫోర్జరీకి పాల్పడ్డారని అలంద మీడియా రవిప్రకాశ్, శివాజీ, మూర్తిలపై ఫిర్యాదు చేసింది. అయితే టీవీ 9 ఫైనాన్సియర్ మూర్తి మాత్రం పోలీసుల విచారణకు హాజరయ్యారు. శివాజీ, రవిప్రకాశ్ స్పందించలేదు. 160 సీఆర్పీసీ నోటీసులను రెండుసార్లు ఇచ్చారు. అయినా స్పందించకుంటే 41ఏ నోటీసులు ఇచ్చారు. అప్పటికీ రవిప్రకాశ్ నుంచి స్పందన రాకపోవడంతో లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులు, నౌకల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో మొదటిసారి నోటీసు ఇచ్చాక బెయిల్ కోసం రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేయగా నిరాశే మిగిలింది. బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.
బెయిల్ నో ..
ఇవాళ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ .. రవిప్రకాశ్ తన హితులకు అందబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. వాట్సాప్ కాల్ చేస్తున్నారని .. కానీ పోలీసుల విచారణకు మాత్రం రావడం లేదని చెప్పారు. రవిప్రకాశ్ తరఫు న్యాయవాది తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం .. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.
వీడియో విడుదల చేసిన రవిప్రకాశ్
ఇదిలాఉంటే మరోవైపు ఇవాళ ఉదయం రవిప్రకాశ్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో టీవీ 9ను తనే స్థాపించానని గుర్తుచేశారు. కంపెనీని మెగా కృష్ణారెడ్డి కొంటానని చెప్పి .. జూపల్లి రామేశ్వరరావు వచ్చారని పేర్కొన్నారు. తన మీద మూడు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. విలువల కోసం పనిచేశానని .. ధనిక స్వాములకు భయపడి ఊడిగం చేయాలా అని ఘాటుగా స్పందించారు.