తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు.. హైకోర్టు నోటీసులు..!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. నోటీసులు జారీ చేసి ఇంకోసారి ఝలక్ ఇచ్చింది న్యాయస్థానం. తెలంగాణలో రవాణా వాహనాల వేగం నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ది రైట్ సొసైటీ సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఆ మేరకు పిటిషనర్ తరపు లాయర్ రచనా రెడ్డి కోర్టు దృష్టికి పలు అంశాలను తీసుకొచ్చారు.
రవాణా వాహనాల మితిమీరిన వేగానికి కళ్లెం వేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు రచనా రెడ్డి. వాస్తవానికి రవాణా వాహనాల స్పీడ్ కారణంగానే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయనే విషయం కేంద్రం రిలీజ్ చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయనే విషయం కోర్టుకు వివరించారు.
కరెంట్ లొల్లి : రేవంత్ రెడ్డి కామెంట్స్పై గరం గరం.. ఉద్యోగులా, రౌడీలా అంటూ మరో కోణం ..!
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టుకు వివరించారు.
రవాణ వాహనాల స్పీడ్ కు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన రాధాకృష్ణన్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వేగ నియంత్రణ వ్యవస్థను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కోర్టుకు విన్నవించారు.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం అలాంటి చర్యలేవీ తీసుకోవడం లేదని న్యాయవాది రచనా రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. తెలంగాణలో రవాణా వాహనాల వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదన్న పిటిషనర్ ఆరోపణలపై.. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది.