అయోమయంలో ఆన్లైన్ క్లాసులు.!విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తే బాద్యత ఎవరిదన్న హైకోర్టు.!
హైదరాబాద్ : తెలంగాణలోని పలు ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు తీసుకుంటున్న ఆన్ లైన్ క్లాసులపట్ల అయోమయం కొనసాగుతూనే ఉంది. విద్ధ్యార్థుల ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తే ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తెలంగాణ న్యాయస్థానం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.ఆన్లైన్ క్లాసులు వల్ల విద్యార్థుల మానసిక, శారీరక పరిస్థితులపై ప్రభావం చూపుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. అంతే కాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్లైన్ తరగతులు నిషేధించాలని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ వేసిన (పబ్లిక్ ఇంట్రెస్టు లిటిగేషన్) పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యాసంవత్సర విధివిధానాలపై ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.
నగరంలోని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు సమయపాలన లేకుండా ఆన్ లైన్ పాఠాలు చెబుతున్నాయని, ఐదో తరగతి లోపు విద్యార్థులు అంతసేపు ఆన్ లైన్లో ఎలా ఉండగలరని హైకోర్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చిన్న పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం చూపుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. కాగా ఆన్లైన్ తరగతుల పట్ల విధివిధానాలను ఖరారు చేశామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రైవేట్ పాఠశాలలు పాటించాల్సిన నిబంధనలను కూడా త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విద్యా శాఖ పరిధిలోని పాఠశాలలకే వర్తిస్తుందా.? అని హైకోర్టు ప్రశ్నించింది. అటు ఆన్ లైన్ తరగతులపై వైఖరి వెల్లడించేందుకు పది రోజుల సమయం కావాలని సీబీఎస్ఈ కోరింది. ఫీజులు వసూలు చేయొద్దన్న జీవోను పాఠాశాలులు ఉల్లంఘిస్తున్నాయన్న పిటిషనర్ ఇదే అంశన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అధిక ఫీజులు వసూలు చేస్తే తిరిగి ఇప్పించే అధికారం తమకుందని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది హైకోర్ట్.