లాయర్ల హత్యపై హైకోర్టు సీరియస్, కీలక ఆదేశాలు .. విధులు బహిష్కరించి లాయర్ల ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలో నడిరోడ్డు మీద న్యాయవాదులు వామన్ రావు , నాగమణి దంపతుల హత్య సంచలనం రేపింది. పట్టపగలు నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా న్యాయవాదులు అయిన దంపతులను కత్తులతో అత్యంత కిరాతకంగా నరికి హతమార్చిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో అందరినీ ఒక్క సారిగా షాక్ కు గురయ్యేలా చేసింది. గట్టు వామన్ రావు దంపతుల హత్యలపై సిబిఐతో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు న్యాయవాది శ్రవంత్ శంకర్ పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్యలపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు
ఇదిలా ఉంటే వామన్ రావు దంపతుల హత్య ప్రభుత్వ హత్యలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ హత్యల వెనక టిఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.ఇదే సమయంలో న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా పరిగణలోకి తీసుకుంటామని చెప్పిన హైకోర్టు జస్టిస్ హిమ కోహ్లీ ధర్మాసనం న్యాయవాదుల హత్య తమ దృష్టిలో ఉందని పేర్కొంది.
నివేదిక ఇవ్వాలని ఆదేశం .. ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందన్న కోర్టు
ఈ హత్యలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తును పూర్తి చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు ధర్మాసనం లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని, ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని సూచించింది. ఈ ఘటన తీవ్ర గర్హనీయమని పేర్కొంది. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకోవాలని పేర్కొన్న హైకోర్టు తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
నేడు విధులు బహిష్కరించి లాయర్ల నిరసన
మరోవైపు న్యాయవాదుల హత్యకు నిరసనగా హైకోర్టులో లాయర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు .ఈ రోజు విచారణకు వచ్చే అన్ని కేసులను బహిష్కరిస్తున్నట్లు హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా కోర్టు, నాంపల్లి, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు, కూకట్పల్లి కోర్టులలో న్యాయవాదులు ఈరోజు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో కోర్టు ఎదుట లాయర్ల ధర్నా తో ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని లాయర్ల డిమాండ్
తెలంగాణలో న్యాయవాదులకు రక్షణ లేదని న్యాయవాద సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వామన్ రావు దంపతుల హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని దోషులకు ఉరిశిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదని న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు.