సీఎం కేసీఆర్ ఇలాకాలో మరో షాక్.. మల్లన్న సాగర్ కేసులో హైకోర్టు ఝలక్.. మరో ఇద్దరికి జైలు శిక్ష!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఇలాకాలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూనిర్వాసితుల కేసులో ఝలక్ ఇచ్చింది. ఇదివరకు ముగ్గురు అధికారులకు జైలు శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం తాజాగా మరో ఇద్దరికి శిక్ష వేసింది. ఇప్పటికే వివిధ కేసుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి పలుమార్లు మొట్టికేయలు వేసిన హైకోర్టు.. మరోసారి షాక్ ఇవ్వడం చర్చానీయాంశమైంది.
సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్న తరుణంలో.. హైకోర్టు తాజాగా వెలువరించిన తీర్పుతో వారికి మరో అస్త్రం దొరికినట్లైంది. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కేసులో న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ సర్కార్కు మరో ఝలక్.. మల్లన్న సాగర్ కేసులో షాక్..!
తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. హైకోర్టు తాజా తీర్పుతో ఇరకాటంలో పడినట్లైంది. మల్లన్న సాగర్ భూనిర్వాసితులపై నిర్లక్ష్యం వహించిన మరో ఇద్దరు అధికారులకు న్యాయస్థానం శిక్ష విధించింది. గత నెల మొదటివారంలో ముగ్గురు అధికారులకు మూడు నెలల జైలు శిక్ష ఖరారు చేసిన హైకోర్టు ఈసారి మరో ఇద్దరు అధికారులకు రెండు నెలల జైలుశిక్ష వేసింది. గతంలోనే భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ క్రమంలో అది ఇంప్లిమెంట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే కారణంతో ఇప్పటివరకు ఐదుగురు అధికారులకు జైలుశిక్ష విధించింది.
జులై మొదటి వారంలో మల్లన్న సాగర్ భూనిర్వాసితుల కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో కోర్టు ఆదేశాలను ధిక్కారించారనే కారణంతో ముగ్గురు అధికారులకు శిక్ష విధించింది. సిద్ధిపేట ఆర్డీవో, తొగుట తహసీల్దార్, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్కు 3 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాదు ఆ ముగ్గురికి 2 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. తాజాగా మంగళవారం నాడు వెలువరించిన తీర్పులో గజ్వేల్ ఆర్డీవో, తహశీల్దార్కు 2 నెలల జైలు శిక్ష, రెండు వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
పరిహారం చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు.. అందుకే..!
మల్లన్న సాగర్ భూనిర్వాసితుల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ మీద షాక్ తగులుతోంది. అప్పట్లోనే భూనిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం.. ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తి పోయడం.. అలా కేసీఆర్ సర్కార్కు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. ఆ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇప్పటికే వివిధ అంశాలకు సంబంధించి హైకోర్టులో ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఝలక్ ఇచ్చిన సందర్భాలున్నాయి. అయితే మల్లన్న సాగర్ భూనిర్వాసితుల కేసులో హైకోర్టు తీర్పులతో సర్కార్ బేజారవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అటు కలెక్టర్ల సమావేశం.. ఇటు హైకోర్టు తీర్పు..!
ఒకవైపు సీఎం క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగుతుండగా హైకోర్టు ఈ తీర్పు వెలువరించడం చర్చానీయాంశమైంది. మల్లన్న సాగర్ భూనిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో తాత్సారం జరుగుతుండటంపై విపక్షాలు సైతం భగ్గుమంటున్నాయి. అదే క్రమంలో హైకోర్టు మంగళవారం నాడు వెలువరించిన తీర్పు కచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భూనిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంపై ప్రభుత్వ వైఖరి ఏంటనేది అందరికి తెలుసని ఆరోపిస్తున్నారు అపొజిషన్ లీడర్లు.