ఉద్యోగుల జీతాల కోత, డాక్టర్ల దాడిపై హైకోర్టులో విచారణ: ప్రభుత్వ వివరణకు ఆదేశం
హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాదులు రాసిన లేఖలను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది.
సీనియర్ న్యాయవాదులు సత్యంరెడ్డి, జంధ్యాల రవిశంకర్ రాసిన లేఖలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అమర్నాథ్ ధర్మాసనం బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. దీనిపై ఏప్రిల్ 17 లోపు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
ఇది ఇలావుంటే, కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మరో న్యాయవాది కరుణసాగర్ రాసిన లేఖను కూడా హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులపై ఇటీవల కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ప్రజలు ఎక్కువగా చేరుకునే ప్రాంతాలైన రైతు బజార్లు, ఆస్పత్రులు, మార్కెట్లలో సామాజిక దూరం పాటించడం సాధ్యంకాదని, అందువల్ల వైరస్, బ్యాక్టీరియాను నిర్మిలించేందుకు టన్నెల్ను ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది రొనాల్డ్ రాజు రాసిన లేఖను కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా తీసుకుంది హైకోర్టు. ఒక్కో టన్నెల్ ధర సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని చెప్పడంతో హైకోర్టు స్పందించింది. దీనిపై సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.