tpcc race: వీడని సస్పెన్స్.. లేట్ ఎందుకంటే.. కారణమిదేనా...
టీ పీసీసీ చీఫ్ ఎంపిక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. ప్రకటించడమే తరువాయి అని చెబుతోన్నా.. ఆలస్యం అవుతూనే ఉంది. వాస్తవానికి నేతల నుంచి ఇంచార్జీ మానిక్కం ఠాగూర్ అభిప్రాయం తీసుకున్నారు. దాదాపు 200 మంది సలహాలు, సూచనలు తీసుకొని హైకమాండ్కు నివేదిక అందజేశారు. ఈ లోపు కమ్యూనిటీ, నేతల పేర్లు వినిపించడంతో.. కొందరు నేతలు లాబీయింగ్ చేస్తున్నారు.
రిపోర్ట్ అందిన తర్వాత కూడా ఆలస్యం..
ఠాగూర్ రిపోర్ట్ అందజేసిన తర్వాత కూడా కొందరు కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పిలిపించి మరీ మాట్లాడారు. వారిలో సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పానని జీవన్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. మధుయాష్కీ గౌడ్తో కూడా హై కమాండ్ పెద్దలు మాట్లాడారు. వీరితో సంప్రదింపుల తర్వాత హస్తిన పెద్దలు ఏ సామాజిక వర్గానికి పదవీ ఇవ్వాలనే అంశంపై మాత్రం స్పష్టత వచ్చింది. జీవన్ రెడ్డి చెప్పిన అంశంతో.. రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ పదవీ లభించే అవకాశం ఉంది.
రెడ్డి సామాజిక వర్గానికే..
రెడ్డి సామాజిక వర్గం నుంచి రేసులో ఉన్నది రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. జగ్గారెడ్డి పేరు వినిపించినా.. ఆయనకు పీసీసీ పోస్టు దక్కదని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేత జీవన్ రెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన మాత్రం సుముఖంగా లేనని చెప్పారు. ఈ క్రమంలో జానారెడ్డికి కూడా హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయనకు కూడా రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఇటీవల పార్టీ వీడతారనే ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఊహాగానాలకు చెక్ పెట్టగా.. ఇప్పుడు పీసీసీ పోస్ట్ అని రూమర్స్ వస్తున్నాయి.
లేట్ ఎందుకంటే.. కారణమిదేనా..?
ఇలా చాలా మంది నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు ఢిల్లీలో మకాం కూడా వేశారు. కానీ పీసీసీ చీఫ్ను మాత్రం ప్రకటించడం లేదు. సాధారణంగా మరో మూడేళ్లలో ఎన్నికలు జరగుతాయి. జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. అంతకన్నా ముందే సన్నద్దం కావాలి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని.. పీసీసీ చీఫ్పై ఆచీ తూచి స్పందిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని.. పీసీసీ చీఫ్ కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని అనుకుంటోంది.