కొంపముంచిన బర్త్ డే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్... హైకోర్టు నోటీసులు..
కరోనా లాక్ డౌన్ వేళ నారాయణ్ ఖేడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నిబంధనలు అతిక్రమించారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న ఆయన.. కరోనా నిబంధనలను పక్కనపెట్టి.. వందల మంది ధూంధాంగా వేడుక నిర్వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బర్త్ డే వేడుకల సందర్భంగా నిత్యావసరాలు పంపిణీ చేస్తారని ప్రచారం జరగడంతో.. వందలాది మంది పేదలు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తోపులాట కూడా జరిగినట్టు తెలుస్తోంది. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోలేదని.. చాలామంది ఫేస్ మాస్కులు కూడా ధరించలేదన్న ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కూడా వారిని అదుపు చేయకపోవడంతో ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడిందని తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి తాజాగా హైకోర్టు కూడా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.నిబంధనలకు విరుద్ధంగా భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారంటూ సామాజిక కార్యకర్త విఠల్ పిల్ దాఖలు చేయడంతో కోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేని కోరింది. ఎమ్మెల్యేతో పాటు తెలంగాణ సీఎస్, డీజీపీ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్కూ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే,భూపాల్ రెడ్డి బర్త్ డే వేడుకలపై వార్త రాసినందుకు తనపై కక్ష కట్టి నిర్మాణంలో ఉన్న తన ఇంటిని అక్రమ కట్టడమని కూల్చేశారని ఓ స్థానిక జర్నలిస్ట్ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.