దర్శకుడు శంకర్కు భూకేటాయింపులు... మరి వాళ్లకూ ఇలాగే ఇస్తారా... ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..
సినీ దర్శకుడు ఎన్.శంకర్కు తెలంగాణ ప్రభుత్వం కారు చౌకగా భూమిని కేటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు మరోసారి విచారణ జరిగింది. రూ.2.5కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.25లక్షలకే ఎలా కేటాయించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దర్శకుడు శంకర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అడ్వకేట్ జనరల్ బదులిచ్చారు. అయితే న్యాయస్థానం ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు.
అలాగైతే వాళ్లందరికీ ఇస్తారా...
అలాగైతే తెలంగాణ కోసం త్యాగం చేసిన వేలాదిమందికి ఇలాగే భూములిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వ్యక్తులకు భూములు కేటాయించే బదులు ప్రభుత్వమే స్టూడియో నిర్మించవచ్చు కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ పరం చేయడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించేలా ఉండవద్దని... కేబినెట్ నిర్ణయాలకు సరైన ప్రాతిపదిక,సహేతుకత ఉండాలని సూచించింది.
రామోజీ ఫిలిం సిటీ ఉండగా మరొకటి ఎందుకు...
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిలిం సిటీ తెలంగాణలోనే ఉండగా... మరో ఫిలిం సిటీ అవసరమేంటని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలుకు ప్రభుత్వం గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం మరో రెండు వారాలకు వాయిదా వేసింది. ఇదే విచారణకు సంబంధించి గతంలోనూ హైకోర్టు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. భూకేటాయింపులు ఒక పద్దతిలో ఉండాలన్న సుప్రీం సూచనను కూడా గుర్తుచేసింది.
కోర్టులో సవాల్ చేసిన ధర్మపురి వాసి
రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని మోకిళ్లలో సినీ స్టూడియో నిర్మాణం కోసం ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున దర్శకుడు శంకర్కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్టూడియో నిర్మాణమైతే దాదాపు 300 మందికి ఉపాధి దొరుకుతుందని గతంలో దర్శకుడు శంకర్ హైకోర్టుకు తెలిపారు. అయితే కోర్టు మాత్రం ఈ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కోట్ల రూపాయల విలువైన భూమిని అతి తక్కువ ధరకు కేటాయించడమేంటని గతంలోనూ ప్రభుత్వం ప్రశ్నించింది.ఈ నేపథ్యంలో చివరకు ఈ భూ కేటాయింపులపై ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.