నిండుకుండలా హిమాయత్ సాగర్.. పదేళ్ల తర్వాత నిండిన.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే..
భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహం వచ్చి చేరడంతో హిమాయత్ సాగర్, హుస్సేన్సాగర్ ప్రమాదకరంగా మారింది. హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టానికి చేరింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని.. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని సీపీ అంజనీకుమార్ సూచించారు.
వర్ష బీభత్సం..
ఐదు రోజుల నుంచి హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు వస్తున్న ఫిర్యాదులను స్వీకరించి.. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో రెండు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. శిథిలావస్థ భవనాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు.
నిండుకుండలా హిమాయత్ సాగర్
భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. ఏ క్షణంలోనైనా డ్యామ్ గేట్లు ఎత్తేందుకు జలమండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ 1762 అడుగులకు చేరింది. 1763 అడుగులు దాటితే గేట్లు ఎత్తేసామని హైదరాబాద్ మెట్రో పాలిటస్ వాటర్ సప్లై జనరల్ మేనేజర్ పేర్కొన్నారు. 2010లో చివరి సారి హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు. పదేళ్ల తర్వాత హిమాయత్ సాగర్ నిండింది. డ్యామ్ గేట్ల దగ్గర లీకేజీ అవుతుండడంతో మరమ్మతులు చేస్తున్నారు. మూసి నదీ పరివాహక ప్రాంతాలైన కిస్మత్ పూర్, బండ్లగూడ, హైదర్ గూడా, లంగర్ హౌస్, కార్వాన్ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు జలమండలి అధికారులు తెలిపారు.
24 గంటలు అందుబాటులో..
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో 24 గంటలు అందుబాటులో ఉండాలని సిబ్బందికి డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని స్పష్టంచేశారు. జిల్లా కలెక్టర్లు, విపత్తు నివారణ శాఖలతో పాట ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధానంగా డయల్ 100కు వచ్చే కాల్స్ అన్నింటీకి ప్రాధాన్యతతో చేపట్టి పరిష్కరించాలని స్పష్టం చేశారు.