నిజాయితీ లీడర్లు కనబడుట లేదు.. 'నోటా' కు ఓటు..! యువజంట వినూత్న ప్రచారం
హైదరాబాద్ : ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఓటుతో నేతల తలరాత మార్చే పవరుంది. ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయిన నేతలున్నారంటే.. ఒక్కో ఓటు విలువ అంతలా ఉంటుంది. ఎన్నికల్లో ఓటు వేసి నేతలను ఎన్నుకుంటున్నా.. నిజాయితీ గల లీడర్లు ఉన్నారా అంటే చెప్పడం కష్టమే. అందుకే నిజాయితీ గల రాజకీయ నేతలు కనబడుట లేదంటూ వినూత్న ప్రచారానికి తెర తీసింది హైదరాబాద్ కు చెందిన యువజంట.
మిస్సింగే..!
అందరూ తమకేంటని కూర్చుంటే దేశం గురించి ఎవరు పట్టించుకుంటారు. ఏదో సందర్భంలో మనం బయటకు రావాలి. వీలైనంత, తోచినంత దేశం కోసం ఏదైనా చేయాలి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ వంటబట్టించుకున్నారు హైదరాబాద్ కు చెందిన స్వాతి, విజయ్. వీరిద్దరు స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న వీరిద్దరు.. ఎన్నికల సమయంలో వినూత్న ప్రచారానికి తెర లేపారు. మిస్సింగ్ హానెస్ట్ పొలిటీషియన్స్ (నిజాయితీ గల రాజకీయ నేతలు కనబడుట లేదు) పేరుతో క్యాంపెయిన్ చేస్తున్నారు. ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు ఖాళీ గోడలపై పెయింటింగ్ వేస్తూ చేపట్టిన ఈ యువజంట ఉద్యమం హాట్ టాపికయింది.
నగరమంతా పెయింటింగ్స్
"కనబడుట లేదు.. నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులు", గమనిక : పైన తెలుపబడిన అంశంపై ఎటువంటి సమాచారం లభించని వ్యక్తులు NOTA ని దృష్టిలో ఉంచుకుని సంప్రదించవలసిన చిరునామా.. మీ పోలింగ్ బూత్, తేది 11 ఏప్రిల్ 2019 అంటూ ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. స్వతహాగా వీరే పెయింటర్లు కావడంతో రోడ్ల వెంబడి ఖాళీగా ఉన్న గోడలపై పెయింటింగ్ వేస్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వీరి క్యాంపెయిన్ కు సంబంధించిన పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
అందరూ అలా అని కాదు..!
నిజాయితీ గల నాయకులు కనిపించడం లేదని వీరు చేస్తున్న విస్తృత ప్రచారానికి ఆదరణ లభిస్తోంది. నిజాయితీ గల నాయకులు లేరంటూ, నోటాకు ఓటుపై అవగాహన పెంచుతున్నారు. రాజకీయ నేతలందరూ నిజాయితీపరులు కాదని చెప్పడం తమ ఉద్దేశం కాదంటున్నారు. ఎలాంటి నేతను ఎన్నుకోవాలో చెబుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ ప్రచారం లక్ష్యమని వివరిస్తున్నారు.
నోటాకు వేస్తారట.!
ఈ యువజంట చేస్తున్న మిస్సింగ్ హానెస్ట్ పొలిటీషియన్స్ ప్రచారం లోక్సభ ఎన్నికల వేళ చేస్తున్నది కాదు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే రీతిన ప్రచారం నిర్వహించారు. ఓటర్లను చైతన్యపరుస్తూ, మధ్యమధ్యలో కొందరిని కలుస్తూ ముందుకు సాగుతున్న ఈ యువజంట ప్రచారానికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం. అయితే కొన్నిచోట్ల సమస్యలకు చాలాకాలం నుంచి పరిష్కారం దొరకడం లేదని పోరాటం చేస్తున్నవారంతా నోటాకు ఓటు వేస్తామని చెబుతున్నారట. మొత్తానికి ఈ వినూత్న ప్రచారం నోటాపై అవగాహన భారీగానే పెంచుతున్నట్లు కనిపిస్తోంది.