హేమంత్ మర్డర్కు మాస్టర్ మైండ్ అతనే.. మరో నలుగురి అరెస్ట్... ఖర్చుకు వెనుకాడని లక్ష్మారెడ్డి...
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన హేమంత్ హత్య కేసులో ప్రధాన నిందితులు యుగంధర్ రెడ్డి, అవంతి తండ్రి లక్ష్మారెడ్డిల ఆరు రోజుల కస్టడీ సోమవారంతో ముగిసింది. హేమంత్ హత్య విషయంలో డబ్బుకు వెనుకాడని లక్ష్మారెడ్డి రూ.30లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్దపడ్డట్లు విచారణలో నిర్దారించారు. హత్యలో అవంతి సోదరుడు ఆశిష్ రెడ్డి పాత్రపై ఆధారాలు లభించలేదని... ఆధారాలు దొరికితే అతనిపై కూడా కేసు నమోదు చేస్తామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
మర్డర్కు మాస్టర్ మైండ్ అతనే...
హేమంత్ హత్య కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. వీళ్లలో సోమయాల రాజు,సాయన్న అనే ఇద్దరు వ్యక్తులతో పాటు హత్య తర్వాత తప్పించుకున్న ఎరుకల కృష్ణ,మహమ్మద్ పాషా ఉన్నట్లు చెప్పారు. హత్య కోసం యుగంధర్ రెడ్డి,లక్ష్మారెడ్డిలు కలిసి వట్టినాగుల పల్లికి చెందిన సోమయాల రాజు(52)ను సంప్రదించగా... అతనే పూర్తి స్కెచ్ వేసినట్లు తెలిపారు. ఇందుకోసం రూ.10లక్షలు సుపారీ ఫిక్స్ చేయగా... రూ.50వేలు ముట్టిందన్నారు.
మరో గ్యాంగ్తోనూ డీల్...
ఎరుకల కృష్ణ(33), మహ్మద్ పాషా అలియాస్ లడ్డూ(32), ఐడీఏ బొల్లారంకు చెందిన రౌడీషీటర్ బ్యాగరి సాయన్న(48)లతో కలిసి సోమయాల రాజు హత్యను అమలుచేసినట్లు తెలిపారు.హేమంత్ హత్య తర్వాత ఐదున్నర తులాల అతని బ్రాస్ లెట్ చైన్ను ఎరుకల కృష్ణ తీసుకున్నాడని... దాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిజానికి ఈ గ్యాంగ్తో డీల్కు ముందే లక్ష్మారెడ్డి మరో గ్యాంగ్ను సంప్రదించినట్లు చెప్పారు. అయితే ఆ గ్యాంగ్ నుంచి అంతగా స్పందన లేకపోవడంతో బావ యుగంధర్ రెడ్డి ద్వారా లక్ష్మారెడ్డి సోమయాల రాజును సంప్రదించినట్లు తెలిపారు. లక్ష్మారెడ్డి మాట్లాడిన ఆ మరో గ్యాంగ్ ఎవరన్న వివరాలు కూడా రాబడుతున్నామని చెప్పారు.
వాళ్లను కూడా కస్టడీలోకి..?
లక్ష్మారెడ్డి,యుగంధర్ రెడ్డిల కస్టడీ ముగియడంతో ఏ7 విజయేందర్ రెడ్డి, ఏ8 అర్థం రంజిత్ రెడ్డి, ఏ9 అర్థం రాకేష్ రెడ్డి, ఏ11 ఎల్లు సంతోష్రెడ్డి, 12 కైలా సందీప్ రెడ్డి, ఏ15 షేక్ సాహెబ్ పటేల్తో పాటు గూడూరు సందీప్రెడ్డిలను పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హేమంత్ హత్య కేసులో ఎస్హెచ్ఓ శ్రీనివాస్కు కరోనా సోకడంతో... ఆయన స్థానంలో డీఐ కాస్ట్రో ఐవోగా డీసీపీ ఉంటారని చెప్పారు.
Recommended Video
నమ్మించి హత్య చేశారు...
నిందితులు విజయేందర్ రెడ్డి,స్పందన,రాకేష్ రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉన్న హేమంత్-అవంతిల ఇంటికి వెళ్లి రెండుసార్లు కలిసినట్లు గుర్తించారు. 'నీవు ఇల్లు వదిలి వెళ్లినప్పటి నుంచి అమ్మ నీపై బెంగ పెట్టుకుంది. ఆమె ఆరోగ్యం బాగాలేదు...' అంటూ అవంతితో మాట్లాడారు. పలుమార్లు ఫోన్లలో ప్రేమగా మాట్లాడుతూ ఆమెను నమ్మించారని చెప్పారు. ఇదే క్రమంలో సెప్టెంబర్ 25న హేమంత్ అవంతిల ఇంటికెళ్లిన లక్ష్మారెడ్డి ఫ్యామిలీ మాట్లాడుకుందాం రమ్మని వారిని కారులో ఎక్కించుకున్నారు. ఆపై చందానగర్లోని ఇంటి వైపు కాకుండా ఓఆర్ఆర్ వైపు కారును మళ్లించడంతో ఇద్దరికీ అనుమానం కలిగింది. ఈ క్రమంలో గోపన్పల్లి వద్ద కారులో నుంచి కిందకు దూకే ప్రయత్నం చేయగా... అవంతి వారి నుంచి తప్పించుకోగలిగింది. కానీ హేమంత్ను ఈడ్చుకుంటూ వెళ్లి మళ్లీ కారెక్కించారు.అక్కడినుంచి జహీరాబాద్ వెళ్లి కారులోనే హేమంత్ను హత్య చేసి సంగారెడ్డిలో మృతదేహాన్ని పడేసి పరారయ్యారు.