భాగ్యనగరంలో నయా ట్రెండ్: మెరిసిన చార్మినార్.. ఆ లిస్ట్లో మరికొన్ని
హైదరాబాద్: చారిత్రాత్మక నగరం హైదరాబాద్లో సరికొత్త ట్రెండ్ ఆరంభమైంది. ఇంతకుముందు ఎప్పుడూ లేని కొత్త ట్రెండ్ హైదరాబాదీలను ఆకట్టుకుంటోంది.. కట్టి పడేస్తోంది. తెలుగు ప్రజల చూపులను తన వైపునకు తిప్పుకొంటోందీ భాగ్యనగరం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేస్తోంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో దాన్ని మరింత విస్తరింపజేశారు అధికారులు.
ట్యాంక్ బండ్ తరహాలోనే..
హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాలను కలిపే ట్యాంక్బండ్ వద్ద ప్రతి ఆదివారం సాయంత్రం సండే ఫండే ఏర్పాటవుతోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం విజయవంతమైంది. ప్రతి సాయంత్రం 5 గంటల తరువాత ట్యాంక్బండ్ మీదుగా వాహనాలను మళ్లిస్తారు అధికారులు. వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. రాత్రి వరకూ అవి కొనసాగుతాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, పోలీసులు సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
సండే ఫండే సక్సెస్ కావడంతో
ఈ ఆదివారం సాయంత్రం కూడా నిర్వహించిన సండే ఫండే ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయింది. సండే ఫండేలో పాల్గొనడానికి జంటనగరాల నలుమూలల నుంచి వందలాది మంది భార్యాపిల్లలతో కలిసి ట్యాంక్బండ్కు చేరుకున్నారు. రాత్రి వరకూ సరదాగా గడిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం వల్ల దీన్ని అధికారులు విస్తరించారు. పాతబస్తీలోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్ వద్ద కూడా ఇలాంటి ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు.
ఏక్ షామ్ చార్మినార్ కె నామ్
ఏక్ షామ్ చార్మినార్ కె నామ్ పేరుతో ఆదివారం సాయంత్రం దీన్ని ప్రారంభించారు. తొలి రోజు వందలాది మంది హైదరాబాదీయులు చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చార్మినార్, జుమ్మా మసీదు వంటి కట్టడాలన్నింటినీ కలర్ఫుల్ లైట్లతో అలంకరించారు. లేజర్తో ముస్తాబు చేశారు. సాయంత్రం 5 గంటలకు మొదలైన ఏక్ షామ్ చార్మినార్ కె నామ్.. అర్ధరాత్రి దాకా కొనసాగింది. పోలీస్ బ్యాండ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.
ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి ట్రాఫిక్ మళ్లింపు.
అర్ధరాత్రి వరకు లాడ్ బజార్ను తెరిచి ఉంచారు. ఫుడ్ స్టాల్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్యాంక్బండ్ వద్ద సండే ఫండే తరహాలోనే ఇక ప్రతి ఆదివారం సాయంత్రం పాతబస్తీలో ఏక్ షామ్ చార్మినార్ కె నామ్ కార్యక్రమం ఉంటుంది. దీనికోసం మధ్యాహ్నం 3 గంటల నుంచే వాహనాల మళ్లింపు ఉంటుంది. రాత్రి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. అఫ్జల్గంజ్, మదీన, గుల్జార్హౌజ్, ఫలక్నుమా, చార్మినార్, మొఘల్పుర, లాడ్బజార్, మోతీగల్లీ, కిల్వత్ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను మళ్లిస్తారు.
పార్కింగ్ లాట్స్..
అఫ్జల్గంజ్, నయాపూల్ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను సర్దార్ మహల్లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ లోపల, కోట్ల అలీజాలోని ముఫీద్ ఉల్ ఆనం బాయ్స్ హై స్కూల్లో పార్క్ చేసుకోవాలి. ముర్గీ చౌక్, శాలిబండ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను మోతీగల్లీ పెన్షన్ ఆఫీస్, ఉర్దూ మస్కాన్ ఆడిటోరియం, ఖిల్వత్ గ్రౌండ్స్, చార్మినార్ సమీపంలోని ఏయూ హాస్పిటల్, చార్మినార్ బస్ టెర్మినల్ ఇన్ గేట్ వద్ద పార్క్ చేసుకోవాలి.
కోవిడ్ ప్రొటోకాల్స్..
మదీనా, పురానాపూల్, గోషామహల్ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను కులీ కుతుబ్ షా స్టేడియం, సిటీ కాలేజ్, ఎంజే బ్రిడ్జి వద్ద పార్క్ చేసుకోవాల్సి ఉంటుందంటూ నగర పోలీస్ కమిషన్ అంజనీకుమార్ తెలిపారు. ఇవే పార్కింగ్ ప్రదేశాలు.. ఇక ప్రతి ఆదివారం కూడా కొనసాగిస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన ప్రొటోకాల్స్ను ప్రతి ఒక్కరూ పాటించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
Recommended Video
లిస్ట్లో మరిన్ని..
ట్యాంక్బండ్, చార్మినార్ వద్ద నిర్వహించిన ఈ రెండు కార్యక్రమాలు కూడా విజయవంతం కావడం అధికారులు, పోలీసుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వాటిని మరింత విస్తరించాలని భావిస్తున్నారు. గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరి, కుతుబ్ షాహి టూంబ్స్, మినీ ట్యాంక్ బండ్ వంటి మరి కొన్ని చోట్ల ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తారామతి బారాదరి నగర శివార్లలో విశాలమైన ప్రాంగణంలో ఉండటం వల్ల..దీని ఈ జాబితాలో చేర్చినట్లు చెబుతున్నారు.