జీహెచ్ఎంసీ హంగ్..? టీఆర్ఎస్కు ముందు నుయ్యి వెనుక గొయ్యి.. ఎంఐఎంతో కలుస్తారా..?
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి... ఎవరి సత్తా ఏంటో తేలిపోయింది... అనూహ్య ఫలితాలతో ఈసారి 'హంగ్' పరిస్థితులే కనిపిస్తున్నాయి. గ్రేటర్ ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. టీఆర్ఎస్ 54,బీజేపీ 47,ఎంఐఎం 42,కాంగ్రెస్ 2 స్థానాలు దక్కించుకున్నాయి. మేయర్ పీఠానికి కావాల్సిన సంఖ్యా బలం 102 ఎవరికీ లేకపోవడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్కు 38 ఎక్స్అఫీషియో ఓట్లు ఉన్నప్పటికీ.. ఇప్పుడు సాధించిన సీట్లతో వాటిని కలుపుకుంటే ఆ పార్టీ బలం 92 మాత్రమే అవుతుంది. అంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో పార్టీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందా..? అన్న చర్చ తెర పైకి వచ్చింది.
జీహెచ్ఎంసీ కాబోయే మేయర్ ఆమేనా...? ప్రగతి భవన్ నుంచి టీఆర్ఎస్ అధిష్టానం పిలుపు..
ఎంఐఎంతో కలుస్తారా...?
ఎంఐఎం సొంతంగా 42 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీకి 10 మంది ఎక్స్అఫీషియో సభ్యులున్నారు. కాబట్టి మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎంను సంప్రదించవచ్చు. అదే జరిగితే ఒకవేళ ఎంఐఎం తమకు డిప్యూటీ మేయర్ పదవి కావాలని పట్టుబట్టవచ్చు. ఒకవేళ చెరో రెండేళ్లు మేయర్ పదవిని పంచుకుందామని ఎంఐఎం ప్రతిపాదిస్తే మాత్రం టీఆర్ఎస్కు ముందు నుయ్యి,వెనుక గొయ్యి లాంటి పరిస్థితి ఎదురవుతుంది. మతతత్వ పార్టీ అని తమను విమర్శించే టీఆర్ఎస్... మతతత్వ ఎంఐఎంతో ఎలా పొత్తు పెట్టుకుంటుందని బీజేపీ నిలదీస్తుంది. ఇప్పటికే హిందువుల ఓట్లను ఏకం చేయడంలో సఫలమైన బీజేపీకి అది మరో అస్త్రాన్ని అందించినట్లవుతుంది.
బయటినుంచి ఎంఐఎం మద్దతునిస్తుందా?
బీజేపీ నుంచి ఆ విమర్శలను ఎదుర్కోకూడదనుకుంటే బయటి నుంచే ఎంఐఎం టీఆర్ఎస్కు మద్దతునివ్వాలి. అయితే అందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒప్పుకుంటారా... మిత్రుడు కేసీఆర్ను ఆదుకుంటారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. ఎంఐఎం కాకుండా టీఆర్ఎస్ ముందు మరో ఆప్షన్ లేదు. ఒక రకంగా ఎన్నికల కంటే ఈ అంశమే ఇప్పుడు టీఆర్ఎస్ను ఎక్కువగా టెన్షన్ పెడుతుండవచ్చు. కాబట్టి ఈ పరిస్థితిని కేసీఆర్ ఎలా గట్టెక్కుతారన్నది వేచి చూడాలి. దీనిపై ఇప్పటికే ప్రగతి భవన్ వేదికగా కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
2009లోనూ హంగ్...
2009 గ్రేటర్ ఎన్నికల్లోనూ హంగ్ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 55 స్థానాలు,ఎంఐఎం 43 స్థానాలు గెలుచుకుని పొత్తు పెట్టుకున్నాయి. రెండు పార్టీలు చెరో రెండున్నరేళ్లు మేయర్ పీఠాన్ని పంచుకున్నాయి. ఇప్పుడు కూడా పరిస్థితి దాదాపుగా అలానే కనిపిస్తోంది. అయితే గ్రౌండ్లో బీజేపీ బలమైన ప్రత్యర్థిగా ఎదగడంతో ఎంఐఎంతో నేరుగా పొత్తు పెట్టుకునేందుకు టీఆర్ఎస్ నేరుగా సాహసించకపోవచ్చు. ఒకవేళ బయటినుంచి ఎంఐఎం మద్దతు పొందినా సరే... సెక్యులర్ వాదిగా చెప్పుకునే కేసీఆర్ను విమర్శించేందుకు బీజేపీకి అది అస్త్రంగానే మారుతుంది. కాబట్టి మున్ముందు తెలంగాణ రాజకీయం ఏ దిశగా పయనించనున్నది వేచి చూడాలి. ఇవన్నీ పక్కనపెడితే... గ్రేటర్లో మరోసారి తామే కింగ్ మేకర్ అని నిరూపించుకునే అవకాశం ఎంఐఎంకి వచ్చింది. గ్రేటర్లో మేయర్ పగ్గాలు చేపట్టాలంటే ఏ పార్టీ అయినా తమ వద్దకు రావాల్సిందేనని ఎంఐఎం మరోసారి నిరూపించుకోబోతుంది.