Have a look: అత్యంత సంపన్నుల జాబితాలో ఏడుగురు హైదరాబాదీలు..!
హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాను బయటపెట్టింది హరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అనే సంస్థ . మొత్తం 137 మంది భారత్ నుంచి బిలయనీర్లుగా ఉండగా అందులో ఏడు మంది హైదరాబాదుకు చెందిన వారిగా నివేదిక గుర్తించింది. ఏ నివేదిక చూసినా భారత్ నుంచి అగ్రస్థానంలో ఉండేది రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కాగా మిగతావరంతా అంబానీ తర్వతే అన్నట్లుగా ఉన్నారు.
దివి ల్యాబొరేటరీస్ అధినేత మురళీ దివి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్నులు జాబితాను హరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020 విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి 135 మంది బిలయనీర్లుగా అవతరించినట్లు వెల్లడించింది. ఇందులో ఏడుగురు హైదరాబాదుకు చెందిన వారని చెప్పడంతో ఎవరై ఉంటారనే చర్చ జరుగుతోంది. దివి ల్యాబొరేటరీస్ సంస్థ వ్యవస్థాపకులు మురళీ దివి జాబితాలో 589వ స్థానం దక్కించుకున్నారు. ఆయన ఆస్తుల విలువ 4.3 బిలియన్ అమెరికా డాలర్లని నివేదిక పేర్కొంది. ఈ సంస్థ 29 ఏళ్ల క్రితం ప్రారంభమైంది.
"మేఘ" కృష్ణారెడ్డి అరబిందో ఫార్మా రాంప్రసాద్లకు చోటు
ఇక తెలంగాణ నిర్మాణరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పి.పిచ్చిరెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లలో 1530వ స్థానం పొందారు. ఆయన ఆస్తుల విలువ 1.9 బిలియన్ అమెరికన్ డాలర్లుగా పేర్కొంది నివేదిక. మేఘ ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ సంస్థను 1989లో ఆయన స్థాపించారు. ఇక ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో పలు ముఖ్యమైన ప్రాజెక్టులను చేపడుతోంది. ఇక మేఘ కన్స్ట్రక్షన్స్కు చెందిన మేఘ కృష్ణారెడ్డి కూడా ఈ సారి జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన 1067వ స్థానం దక్కించుకున్నారు. మేఘా కృష్ణారెడ్డి ఆస్తుల విలువ 1.8 బిలియన్ డాలర్లుగా ఉంది. మేఘా కృష్ణారెడ్డితో పాటుగా అరబిందో ఫార్మా సహవ్యవస్థాపకులు పీవీ రామ్ప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు. రాంప్రసాద్ రెడ్డి ఆస్తుల విలువ కూడా 1.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
1.5 బిలియన్ డాలర్లతో మైహూం అధినేత జూపల్లి
ఇక ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ ఛైర్మెన్, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు 1.5 బిలియన్ అమెరికా డాలర్లతో 2000 స్థానంలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా జూపల్లి రామేశ్వర్ సుపరిచితులు. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీ కూడా ఈ సారి జాబితాలో కొత్తగా చేరింది. ఈ సంస్థకు చెందిన జీవీ ప్రసాద్ మరియు జీ అనురాధాలు 1 బిలియన్ అమెరికా డాలర్లతో 2642వ స్థానంలో నిలిచారు. 2019లో భారత్ నుంచి 33 మంది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరారు.
ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ
మొత్తం 137 మంది బిలియనీర్లు ఉండగా ఒక్క 2019లో కొత్తగా 33 మంది బిలయనీర్లను భారత్ తయారు చేసిందని నివేదిక పేర్కొంది.దీంతో భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించిందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనా అమెరికా దేశాల తర్వాత భారత్ ఉన్నట్లు నివేదిక చెబుతోంది. చైనాలో 799 మంది బిలియనీర్లు ఉండగా.... అమెరికాలో 626 మంది బిలయనీర్లు ఉన్నట్లు రిపోర్టు తెలిపింది. ఇక 137 మంది భారతీయ బిలియనీర్లలో 32 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 67 బిలియన్ అమెరికా డాలర్లతో ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడుగా నిలిచారని నివేదిక తెలిపింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అంబానీ 9వ స్థానంలో ఉన్నారు. టెలికాం సెక్టార్లో వచ్చిన లాభాలే అంబానీని మరోస్థాయిలో నిలిపాయని వెల్లడించింది.
Recommended Video
అత్యంత పిన్నవయసున్న బిలియనీర్గా ఓయో అధినేత రితేష్ అగర్వాల్
ఇదిలా ఉంటే గౌతమ్ అదాని ఆస్తుల్లో కాస్త పెరుగుదల కనిపించింది. మొత్తం 17 బిలియన్ అమెరికా డాలర్లు మేరా పెరిగినట్లు నివేదిక వెల్లడించగా... ఈ సారి జాబితాలోకి తొలిసారిగా కొటాక్ మహీంద్ర బ్యాంక్ అధినేత ఉదయ్ కొటాక్ ఎంట్రీ ఇచ్చినట్లు స్పష్టం చేసింది. ఇక భారతీ ఎయిర్టెల్ ఛైర్మెన్ సన్నీ మిట్టల్ ఆస్తుల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఇక డీ-మార్ట్ అధినేత రాధాకిషన్ దమాని ఆస్తులు ఏకంగా 80శాతంకు పెరిగినట్లు రిపోర్టు వివరించింది. ఇక బిలియనీర్ల రాజధానిగా ముంబై నగరం గుర్తింపు పొందింది. 50 మంది బిలియనీర్లు ముంబై నగరంలో నివసిస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఓయో హోటల్స్ అధినేత రితేష్ అగర్వాల్ అత్యంత తక్కువ వయసున్న బిలియనీర్గా అవతరించడం విశేషం. ఆయన ఆస్తుల విలువ 1.1 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉందని సమాచారం.