కట్నం కోసం భార్య దారుణ హత్య: భర్తకు జీవితఖైదు
హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్యను దారుణంగా హత్య చేసిన భర్తకు కోర్టు జీవిత ఖైదు విధించింది కోర్టు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మల్లాపూర్కు చెందిన నిందితుడు గట్టోళ్లు మహిపాల్ రెడ్డికి సరిత(23)తో గత కొంత కాలం క్రితం వివాహమైంది. మల్లాపూర్(నాచారం)లోని గ్రీన్ హిల్స్ కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, సరిత రూ. 5వేల జీతానికి ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. మహిపాల్ రెడ్డి ఫైనాన్స్ ద్వారా టాటా ఏస్ వాహనం నడుపుతున్నాడు. అయితే, ఆ వాహనానికి సంబంధించిన వాయిదాలు కట్టకపోవడంతో ఫైనాన్స్ అధికారులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అప్పట్నుంచి మహిపాల్ రెడ్డి మద్యానికి బానిసగా మారాడు. ఏ పనీ చేయకుండా.. సరితను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తుండేవాడు. అంతేగాక, అదనపు కట్నం తేవాలంటూ ఆమెను చితకబాదేవాడు. ఇక తన కూతురు బాధ చూడలేక ఆమె తండ్రి.. మహిపాల్ రెడ్డికి ఒక ఎకరం వ్యవసాయం భూమిని కూడా అప్పగించాడు. తన కూతురును వేధించవద్దని వేడుకున్నాడు.
అయినా మహిపాల్ రెడ్డిలో ఎలాంటి మార్పూరాలేదు. మార్చి 21, 2012లో డబ్బులు కావాలంటూ సరితను వేధించాడు. తన దగ్గర లేవంటూ ఆమె చెప్పింది. కాగా, ఆ రోజు రాత్రి 10.30గంటల సమయంలో మద్యం సేవించి వచ్చిన మహిపాల్ రెడ్డి.. మరోసరి డబ్బులు కావాలంటూ సరితను వేధించాడు. కాసేపు గొడవపడిన తర్వాత సరిత పడుకుంది. మద్యం మత్తులో ఉన్న మహిపాల్ రెడ్డి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది.
కాగా, ఆమె ఒంటిపైనున్న పుస్తెలతాడును తీసుకుని మహిపాల్ రెడ్డి అక్కడ్నుంచి పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన సరితను స్థానికులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 22, 2012లో సరిత మృతి చెందింది. మరణించే ముందు సరిత ఇచ్చిన వాంగ్మూలంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన కోర్టు అతనికి జీవితఖైదు శిక్ష విధించింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్.. నిందితుడికి శిక్షపడేలా చేసిన పోలీసు అధికారులను అభినందించారు. వారికి రివార్డును కూడా అందించారు.