హుజూర్ నగర్ లొల్లి.. ఉత్తమ్ను రేవంత్ టార్గెట్ చేయడం వెనుక అసలు కథ అదంట..
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి అంశంలో చిన్న పాటి యుద్దం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ఆసక్తి నెలకొన్న ఈ నియోజకవర్గం ఉప ఎన్నికపై పార్టీ లో చాలా మంది ముఖ్య నేతలు దృష్టి సారించారు. సీటు పై ఎంతో మంది ఆశలు పెట్టుకోగా మరికొంత మంది నేతలు తమ అనుయాయులకు హుజూర్ నగర్ సీటును ఇప్పిస్తానని వాగ్దానాలు కూడా చేసినట్టు తెలుస్తోంది.
ఐతే పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అకస్మాత్తుగా అభ్యర్ధి పేరును తెరమీదకు తీసుకు రావడంతో విభేదాలు భగ్గుమన్నాయి. ఐతే పార్టీ ముఖ్యనేత రేవంత్ రెడ్డి మాత్రం హుజూర్ నగర్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతిని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఐతే పద్మావతిని వ్యతిరేకించడంలో లాజిక్ ఉందటున్నారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక చిచ్చు..! కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న విభేదాలు..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య హుజూర్ నగర్ ఉప ఎన్నిక చిచ్చు రగిలిస్తోంది. సఖ్యతగా ఉన్న నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇదే అంశంలో రాష్ట్ర స్థాయి నేతలు ఒకరిమీద మరొకరు ఆరోపణలు కూడా గుప్పించుకుంటున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి పేరును టీపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో ఒక్కసారిగా బేదాభిప్రాయాలు తెరమీదకు వచ్చాయి.
రేవంత్ ఓ అడుగు ముందు..
ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సంస్కృతికి విరుద్దంగా వ్యవహరించారనే అభిప్రాయలను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మల్కాజి గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందకు వేసి కాంగ్రెస్ అదిష్టానం అనుమతి లేకుండా అభ్యర్థిని ప్రకటించినందుకు ఉత్తమ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
రేవంత్ రెడ్డి చెప్తున్న లాజిక్..! అదిష్టానం ఏంచేయబోతుందో..!!
ఐతే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయబోయే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పేరును ఉత్తమ్ ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి అంతగా వ్యతిరేకించడానికి కారణాన్ని కూడా వివరిస్తున్నారు. తాను ఏ పని చేసినా, ఏ ప్రకటన చేసినా అందులో లాజిక్ ఖచ్చితంగా ఉంటుందని రేవంత్ చెప్పుకొస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలు చీలిపోయారు.
పద్మావతికి న్యాయం జరుగుతుందని
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కూడా తాను చెప్పేది వందకు వంద శాతం జరుగుతుందని రేవంత్ స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుండి పోటీ చేసిన పద్మావతి స్వల్ప తేడాతో ఓడిపోవడం, దాని మీద న్యాయస్థానంలో కేసు నడుస్తుండడం తెలిసిందే..! అయితే కోర్టు తీర్పు పద్మావతికి సానుకూలంగా వస్తుందనే ఆలోచనతోనే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది.
పెండింగ్ లో ఉన్న కోదాడ సాధారణ ఎన్నిక తీర్పు..! ఏమైనా జరగొచ్చంటున్న కాంగ్రెస్..!!
కాగా సాధారణ ఎన్నికల సందర్బంగా కోదాడలో ఓట్ల లెక్కింపులో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని, పోలైన ఓట్లను పూర్తిగా లెక్కించక ముందే టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ గెలిచినట్టు నిర్ధారించారని పేర్కొంటూ పద్మావతి కోర్లులో పిటీషన్ దాఖలు చేసారు. తెలంగాణ వ్యాప్తంగా మరో పదహారు నియోజక వర్గాల్లో ఇలాగే జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులు కేసులు పెట్టినట్టు తెలుస్తోంది.
కోర్టు తీర్పు అనుకూలంగా..
ఐతే న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఒక వేళ ఓట్ల లెక్కిపుంలో అవకతవకలు జరిగాయని నిర్దారణ జరిగితే కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని విజేతగా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయని రేవంత్ రెడ్డి విశ్లేషిస్తున్నారు.
లాజిక్ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి..! స్పష్టం కాని ఉత్తమ్ వైఖరి..!!
ఇదిలా ఉండగా తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థిగా పద్మావతి పేరును నిర్ధారించిన తర్వాత, రేపు కోదాడ తీర్పు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చినప్పుడు మళ్లీ కోదడలో పద్మావతి రాజీనామా చేస్తారా అని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నారు. అందుకే హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి అంశంలో ఉత్తమ్ తో పాటు ఎవ్వరూ కూడా తొందర పడాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు.
చామల కిరణ్ కుమార్ రెడ్డికి నా మద్దతు
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి అన్ని అర్హతలున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి సరైన నాయకుడని స్పష్టం చేస్తున్నారు. అదికార పార్టీని ధీటుగా ఎదుర్కొనే సత్తా కిరణ్ కుమార్ ఉందని, అంతే కాకుండా అదిష్టానం అండదండలు కూడా కిరణ్ కుమార్ కే ఎక్కువగా ఉన్నాయని రేవంత్ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విభేదాలకు కారణమైన హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్ధి చిచ్చు ఎప్పటికి చల్లారుతుందో చూడాలి అని రేవంత్ రెడ్డి పేర్కొ్నారు.