ఉలిక్కిపడ్డ హైదరాబాద్ పాతబస్తీ: అర్ధరాత్రి ప్రమాదం: 13 మందికి గాయాలు: ఆసుపత్రిలో
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారెవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులందరూ జీవనోపాధిని వెదుక్కుంటూ పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్కు వచ్చిన వారే. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.
వీడియో: ఏ3గా కళా వెంకట్రావ్: విడుదల: అరెస్ట్కు కారణం వెల్లడించిన విజయనగరం ఎస్పీ
పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన సంభవించింది. ఓ ఇంట్లో సిలిండర్ గ్యాస్ పేలడంతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులందరూ పశ్చిమ బెంగాల్కు చెందిన వారు. కొంతకాలంగా ఫతుల్లా బేగ్లైన్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. చార్మినార్ పరిసరాల్లో గల స్వర్ణకార దుకాణాల్లో పని చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత వారు నిద్రిస్తోన్న సమయంలో వంటగ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 13 మందికీ తీవ్ర గాయాలు అయ్యాయి.
పేలుడు శబ్దం వినిపించిన వెంటనే స్థానికులు ఉలిక్కిపడ్డారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ ద్వారా గాయపడ్డ వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. సిలిండర్ పేలిన వెంటనే మంటలు చెలరేగాయి. వాటికి- బంగారు ఆభరణాలు తయారు చేయడానికి, వాటిని శుభ్రం చేయడానికి వినియోగించే కెమికల్స్ తోడు కావడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో గాయపడ్డ వారికి ప్రాణాపాయం తప్పినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వారికి అత్యవసర చికిత్సను అందిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. పాతబస్తీలో ఇతర ప్రాంతాల్లో నివసించే వారి బంధువులు, స్నేహితులకు ఈ విషయాన్ని తెలియజేశామని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.