పాతబస్తీలో దారుణం: పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి ఇంటికెళితో, పొడిచి యువతిని చంపేశారు
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోవాలంటూ తనను ప్రేమించిన ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతిని సోదరుడితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనా నగర్లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్కు చెందిన రాధిక అనే యువతి.. పాతబస్తీకి చెందిన ముస్తాఫా గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ప్రియుడికి ఇంటికి వెళ్లిన రాధిక.. ప్రేమించావు కాదా, పెళ్లి చేస్కో అంటూ ముస్తాఫాను నిలదీసింది.
దీంతో ముస్తాఫా కుటుంబసభ్యులు, రాధికకు మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి తర్వాత ముస్తాఫా, అతని సోదరుడు జమిల్ కలిసి రాధికని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. హత్యకు ముందు జమిల్ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా తరలించి, ఆ తర్వాత బాధితురాలి స్వగ్రామం నారాయణఖేడ్కు తరలించారు.
భవనంపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని చందానగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. 27ఏళ్ల ఓ వివాహిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరు నెలల క్రితం వరంగల్కు చెందిన శబరీష్ అనే యువకుడితో కరీంనగర్కు చెందిన బాధితురాలు శ్రీవిద్యకు వివాహం జరిగింది. భర్త శబరీష్ ఉద్యోగరీత్యా బెంగళూరుకు వెళ్లడంతో ఆమె చందానగర్లోని వారి కుటుంబసభ్యుల ఇంటికి వెళ్లారు.
కాగా, శనివారం మధ్యాహ్నం భర్త శబరీష్తో ఫోన్లో మాట్లాడుతూ ఏదో విషయంపై ఇద్దరూ గొడవపడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఐదో అంతస్తు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతి చెందారు. శబరీష్ వేధింపుల వల్లే శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.