హైదరాబాద్ గచ్చిబౌలిలో భూప్రకంపనలు... ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం...
ఇటీవల హైదరాబాద్లోని బోరబండలో భారీ శబ్దాలతో కూడిన భూప్రకంపనలు మరిచిపోకముందే.. తాజాగా గచ్చిబౌలిలోనూ భూప్రకంపనలు సంభవించాయి. స్థానిక టీఎన్జీవోఎస్ కాలనీ,ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్లో మంగళవారం(అక్టోబర్ 13) రాత్రి భూమి కంపించినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.30గంటల నుంచి మొదలై బుధవారం(అక్టోబర్ 14) తెల్లవారుజామున 4గంటల వరకు పలుమార్లు భూమి కంపించిందన్నారు.
భూప్రకంపనలతో తమ ఇళ్లు అదిరాయని.. దీంతో భయభ్రాంతులకు గురయ్యామని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం,బుధవారం రాత్రి సమయాల్లో కూడా భూమి కంపించినట్లు అనిపించిందని... భారీ శబ్దాలు వినిపించాయని తెలిపారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి చాలాసేపు రోడ్ల మీదే నిలుచున్నట్లు చెప్పారు. భూప్రకంపనలపై ఫిర్యాదుతో శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ వెంకన్న అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ కమిషనర్... డీఆర్ఎస్ బృందాలను అందుబాటులో ఉంచుతామన్నారు. నిపుణులతో మాట్లాడి భూప్రకంపనలకు అసలు కారణమేంటో తెలుసుకుంటామని చెప్పారు.
ఈ నెల ఆరంభంలో నగరంలోని బోరబండలోనూ భారీ శబ్దాలతో కూడిన భూప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు,మూడు రోజులు అక్కడ భూప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 0.8 నమోదయినట్లు ఎన్జీఆర్ఐ (National Geophysical Research Institute) అధికారులు వెల్లడించారు.దీని తీవ్రత అతి స్వల్పంగా మాత్రమే ఉందని... భయపడాల్సిన పనేమీ లేదని చెప్పారు. ఇటీవలి భారీ వర్షాలకు... వాన నీరు భూమిలోకి ఇంకడంతో... భూమి పొరల్లో ఉండే గాలి బయటకు రావడం వల్ల భారీ శబ్దాలు వస్తున్నట్లు చెప్పారు. దీన్ని భూకంపంగా భావించవద్దని స్పష్టం చేశారు.గతంలో 2017 అక్టోబర్లోనూ బోరబండలో ఇలా భారీ శబ్దాలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. 25 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి శబ్దాలు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.