శంషాబాద్ ఎయిర్పోర్టులో వినూత్న ప్రయోగం: ఇక ప్రయాణికుల ఎంట్రీ ఎలా ఉంటుందంటే..?
హైదరాబాదు: కరోనాకారణంగా దాదాపు 50 రోజులకు పైగా దేశంలో లాక్డౌన్ అమలులో ఉండటంతో జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాదు దేశం కూడా ఆర్థికంగా నష్టపోయింది. ఇక లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ కొన్నిటికీ ఆంక్షలు ఎత్తివేస్తూ కేంద్రం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ వస్తోంది. తాజాగా రైలు ప్రయాణాలకు అనుమతిచ్చిన కేంద్రం ఇక విమాన ప్రయాణాలకు కూడా అనుమతిచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలోనే దేశంలోని ఆయా విమానాశ్రయాలు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అయితే శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఒక్కసారి తెలుసుకుందాం.
Recommended Video
కాంటాక్ట్లెస్ విధానం
సాధారణంగా విమాన ప్రయాణికులు తమ డాక్యుమెంట్లను ఎయిర్పోర్టులో సిబ్బందికి అంజేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బుక్ చేసుకున్న టికెట్, పాస్పోర్టు డాక్యుమెంట్స్ సీఐఎస్ఎఫ్ సిబ్బందికి వెరిఫికేషన్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొత్తగా ప్రయాణికుల కోసం ఇంప్లిమెంట్ చేస్తున్న కాంటాక్ట్లెస్ ఎంట్రీ ప్రకారం ప్రతి డొమెస్టిక్ టర్మినల్ గేట్ వద్ద ఒక కెమెరాను అమర్చడం జరిగింది. ప్రయాణికులు ఈ కెమెరా ముందు తమ డాక్యుమెంట్లను ఉంచితే దాన్నుంచి వచ్చే ఔట్పుట్ను వీటికోసం ప్రత్యేకంగా రూపొందించిన కంప్యూటర్లలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెరిఫై చేస్తారు. అంటే ఇక్కడ వారు ప్రయాణికుడితో కాంటాక్ట్లోకి రారు.
అంతా కెమెరాలతోనే...
ఇదే కాదు ప్రతి గేట్ వద్ద థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రయాణికులకు జ్వరం ఉందేమో అని పరీక్షిస్తారు.ఒకవేళ అధిక టెంపరేచర్ నమోదైతే వెంటనే అధికారులను అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ప్రతి చెక్ ఇన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ కార్డు మరియు లగేజీ ట్యాగ్ డిస్పెన్సింగ్ మెషీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. చెక్ ఇన్న అయ్యాక ప్రయాణికులు బోర్డింగ్ కార్డులు మరియు లగేజీలు తీసుకుని సెక్యూరిటీ స్క్రీనింగ్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ దగ్గర ప్రతి ట్రేను శానిటైజ్ చేయడం జరుగుతుంది.
బోర్డింగ్ పాసులు ఇలా కూడా..
ఇదిలా ఉంటే ప్రయాణికులు బోర్డింగ్ పాసులను భౌతికంగా లేదా ఈ-కాపీ ద్వారా తీసుకొని రావొచ్చని ఎయిర్పోర్టు అధికారులు చెప్పారు. బ్యాగేజీలు విమానంలోకి వెళ్లకముందు పూర్తిగా శానిటైజ్ అవుతాయని అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇక టర్మినల్ బిల్డింగ్ మొత్తం చాలావరకు ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటు చేశారు అధికారులు.