మబ్బే మసకేసిందిలే..! పొగ మంచే తెరగా మారిందిలే..! నగరంలో కనువిందుగా చల్లని వాతావరణం..!!
హైదరాబాద్ : హైదరాబాద్ వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. కవులు, భావుకులు వర్ణించే వాతావరణం సాక్షాత్కరిస్తోంది. పొగ మంచుతో, చిరు జల్లులతో నగర వాసులను పులకింతంకు గురిచేస్తోంది నగర ప్రకృతి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
దీని ప్రభావంతో రెండ్రోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం వల్ల తెలంగాణలో రుతుపవనాలు మరింత చురుకుగా ముందుకు కదులుతున్నాయని చెప్పారు. జార్ఖండ్ దానిని ఆనుకుని ఉన్న పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో రెండ్రోజులుగా కొనసాగుతున్న అల్పపీడనం బలహీనంగా మారిందని అధికారులు తెలిపారు. కాగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
నగరంలో కురుస్తున్న వర్షాలతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలను ముసురు కప్పేయడంతో రెండు, మూడు గంటల పాటు స్థానిక ప్రజలు తన్మయత్వానికి గురయ్యారు. రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి జల్లులతో నగరంలో వాతావరణం చల్లబడింది. జల్లులతో పగటి ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలకు పడిపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సోమాజిగూడ, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మూసాపేట, కుత్బుల్లాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో రహదారులపై వరదనీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. రామచంద్రాపురంలో అత్యధికంగా 1.1 సెం.మీ వర్షపాతం నమోదైంది.
మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జార్ఖండ్ దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం బలహీన పడిందని, వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. దీని ప్రభావంతో మరో రెండు, మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయన్నారు.