బీజేపీ నేతకు శఠగోపం.. 75 లక్షలకు స్వామీజీ ఎసరు
హైదరాబాద్ : రూపాయి దానం చేయమంటే సవాలక్ష మాట్లాడతారు. అదే మోసగాళ్లు చెప్పే మాయమాటలకు ఠపీమని బుట్టలో పడతారు. లక్షలకు లక్షలు అప్పనంగా అప్పజెప్పుతారు. అదే కోవలో హైదరాబాద్ కు చెందిన ఓ బీజేపీ నేతకు స్వామీజీ ముసుగులో శఠగోపం పెట్టాడు మాయగాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 75 లక్షల రూపాయలు నొక్కేశాడు.
కేఏ పాల్ నామినేషన్లో ట్విస్ట్.. అవి లేకుండానే దాఖలు..!
బీజేపీ నేతలే టార్గెట్
ఉత్తరప్రదేశ్ కు చెందిన త్రిలోక్ నాథ్ బీజేపీ నేతలకు దగ్గరయ్యాడు. దైవశక్తులు ఉన్నాయని నమ్మిస్తూ పూజలు చేస్తున్నాడు. దాదాపు ఐదేళ్ల నుంచి ఇదే తంతు. దేశవ్యాప్తంగా తిరుగుతూ పలువురు బీజేపీ నేతల ఇళ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాడు. ఒకరి ద్వారా మరొకరిని పరిచయం చేసుకుంటూ దేశం నలుమూలలా బీజేపీ లీడర్లకు సన్నిహితుడయ్యాడు.
గుజరాత్ కు చెందిన ఓ మంత్రి.. దాద్రా, నగర్ హవేలీలో పెద్ద భవనాన్ని కానుకగా ఇచ్చాడంటే ఇతగాడి లీలలు ఏమేర ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మాటలతో బురిడీ కొట్టిస్తూ పూజల పేరిట లక్షలాది రూపాయలు కాజేస్తున్నాడు. నెలలో 20 రోజులు దేశం నలుమూలలా పర్యటిస్తాడు. ఆ క్రమంలో 2017లో ఓ సంస్థ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ కు వచ్చిన త్రిలోక్ నాథ్ కు దిల్సుఖ్నగర్లో ఉండే బీజేపీ లీడర్ పరిచయమయ్యాడు. సంపద సృష్టి, ఆరోగ్యం బాగుండటానికి ప్రత్యేక పూజలు చేస్తానంటూ బురిడీ కొట్టించాడు.
కేంద్రమంత్రులు మనోళ్లే.. 75 లక్షలు స్వాహా
పరిచయం కాస్తా ముదిరాక సదరు బీజేపీ నేతకు త్రిలోక్ నాథ్ ఫోన్ చేశాడు. ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో ప్రావిడెంట్ ఫండ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ పదవి ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పాడు. కేంద్రమంత్రులు మనోళ్లే అంటూ.. ఖర్చుల నిమిత్తం 75 లక్షల రూపాయలు నొక్కేశాడు. అయితే డబ్బులు తీసుకుని పని చేసి పెట్టకపోవడంతో ఆ బీజేపీ లీడర్ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇప్పుడంటూ త్రిలోక్ నాథ్ దాటవేస్తూ వచ్చాడు.
విసిగి వేసారిపోయిన బీజేపీ నాయకుడు డిసెంబర్ నెలలో త్రిలోక్ నాథ్ ను గట్టిగా నిలదీశాడు. దాంతో అప్పటికప్పుడు తప్పించుకోవడానికి త్రిలోక్ నాథ్ నకిలీ నియామకపు పత్రం పంపించాడు. అయితే అది బోగస్ అని తేలడంతో మోసపోయానని గ్రహించి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు సదరు బీజేపీ లీడర్.
డొంక కదిలింది.. మోసగాడి గుట్టురట్టు
బీజేపీ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్రిలోక్ నాథ్ కదలికలపై నిఘా పెంచారు. దాద్రా, నగర్ హవేలీలో ఉన్నాడనే సమాచారంతో ఈనెల 20వ తేదీన అక్కడికి వెళ్లారు. 35 ఏళ్ల వయసున్న నిందితుడు స్వామి త్రిలోక్ నాథ్ అలియాస్ సోను కిర్టి పాండేను అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచిన తర్వాత పీటీ వారెంటుతో హైదరాబాద్ కు తరలించి శనివారం (23.03.2019) నాడు జైలుకు పంపించారు. ఈ కేసుకు సంబంధించి మరో నలుగురు నిందితులు అజయ్ గిరి, జ్యోతిపాండే (త్రిలోక్ నాథ్ భార్య), రాజీవ్ కుమార్ యాదవ్, గిరీష్ వర్మ పరారీలో ఉన్నారు.