అమెరికా చెల్లె నమ్మింది.. హైదరాబాద్ అన్న మోసం చేసిండు.. కోటిన్నర మాయం..!
హైదరాబాద్ : సొంత అన్న కదా అని నమ్మింది చెల్లె. సొంత చెల్లె కదా అని అలుసుగా తీసుకున్నాడు అన్న. అటు నమ్మకం, ఇటు మోసం.. ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నివాసముండే సుధామంత్రి 1990లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అనంతరం తన సోదరుడు శ్యాంమంత్రితో పాటు వదిన మాధవీలతను అక్కడికే రప్పించుకుని వారిద్దరికి ఉద్యోగాలు ఇప్పించారు. కొన్నాళ్లపాటు అక్కడే ఉద్యోగాలు చేసిన శ్యాంమంత్రి, మాధవీలత ఇండియాకు తిరిగివచ్చారు.
బస్తీ, గల్లీ 'బచ్చే గ్యాంగ్' లపై పోలీస్ నజర్.. మత్తులో రెచ్చిపోతున్న యువతకు చెక్
సుధామంత్రికి హైదరాబాద్ లో పలుచోట్ల ఆస్తులున్నాయి. వాటికి సంబంధించి అద్దెలు వసూలు చేయడం, నిర్వహణ పనులు చూసుకుంటానంటూ చెల్లిని నమ్మించాడు అన్న. దాంతో సుధామంత్రి ఆయన పేరిట జీపీఎ చేశారు. పలు పత్రాలపై సంతకాలు చేశారు.
కొంతకాలంగా అన్న, వదిన తీరులో మార్పు రావడం గమనించారు సుధామంత్రి. అద్దెలు వసూలు చేసుకుంటూ తన అకౌంట్లో డబ్బులు వేయడం లేదన్న విషయం గుర్తించారు. అంతేకాదు సుధామంత్రి పేరిట పలు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు సైతం విత్ డ్రా చేసినట్లు తెలుస్తోంది. అలా మొత్తంగా కోటి 32 లక్షల రూపాయల మేర మోసం చేశారు. అన్న, వదినల వికటబుద్ధి గ్రహించి మేల్కొన్న సుధామంత్రి హైదరాబాద్ చేరుకున్నారు. సొంత చెల్లి అని కూడా చూడకుండా మోసానికి పాల్పడ్డ శ్యామంత్రితో పాటు వదిన మాధవీలతపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.