నీ నగ్న ఫొటోలు యూట్యూబ్లో పెడతా..: భార్యకు సినీ రచయిత బెదిరింపులు
హైదరాబాద్: తనపై పెట్టిన కేసు వాపస్ తీసుకోకపోతే.. నగ్న ఫొటోలు యూట్యూబ్లో పెడతానంటూ తన భార్యను బెదిరింపులకు గురిచేసిన సినీ రచయిత యర్రంశెట్టి రమణ గౌతమ్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నారు.
భర్తపై వేధింపుల కేసు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎస్బీటీనగర్లో నివసించే రమణగౌతమ్ అదే ప్రాంతంలో నివసించే ఓ యువతి(24)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్థలు రావడంతో 2019 జూన్ నెలలో భర్తపై ఆమె వేధింపులు, మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కేసు నమోదైంది.
న్యూడ్ ఫొటోలు యూట్యూబ్లో పెడతానంటూ..
ఈ క్రమంలో కౌన్సెలింగ్ ఇవ్వడంతో కలిసి ఉండేందుకు అంగీకరించారు. అయితే, కొన్నాళ్ల నుంచి రమణగౌతమ్ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. అంతేగాక, ఆమెకు ఫోన్లు చేసి కేసు వాపసు తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. లేదంటే ఆమె నగ్న చిత్రాలను యూట్యూబ్లో పెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని బాధితురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సోదరి కూడా సనీపరిశ్రమలోనే ఉందని, ఆమె స్నేహితుల వద్ద అసభ్యంగా మాట్లాడటం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మేజర్తో రెండో పెళ్లి..
ఇది ఇలావుంటే, మరో ఘటనలో భర్తతో గొడవపడిన ఓ మహిళ విచక్షణ కోల్పోయి అతడ్ని హతమార్చింది. ఈ దారుణ ఘటన నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్కు చెందిన సబీనారోషన్(50), విశాల్ దివాన్(45) భార్యాభర్తలు. సబీనారోషన్ ఆర్మీలో పనిచేసి లెఫ్టినెంట్ కల్నల్గా, విశాల్ దివాన్ మేజర్గా ఉద్యోగ విరమణ చేశారు. కాగా, ఆమె మొదటి భర్తతో ఈ వివాహం అనంతరం విడాకులు తీసుకుంది. వారికి 23ఏళ్ల ఓ కూతురు ఉంది. విశాల్ దివాన్తో ఈమెకు 12ఏళ్ల బాలుడు ఉన్నాడు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్సిటీ మైఫిల్ టవర్లో వీరంతా కలిసి ఉంటున్నారు.
కత్తితో పొడిచి చంపింది.. పిల్లలు భయంతో...
కాగా, త కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఆవేశంలో కత్తితో భర్త ఛాతీలో పొడిచింది. దీంతో అతడు కుప్పకూలిపోయాడు. పిల్లలు భయంతో పక్కింటికి పరుగులు తీశారు. స్థానికులు విశాల్ను ఆస్పత్రికి తరలిస్తుండగా.. అతడు ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలు సబీనా రోషన్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అయితే, సబీనా మానసిక స్థితి బాగోలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. తల్లిదండ్రులు దూరమవడంతో ఇద్దరు పిల్లలు ఒంటరివారైపోయారు. ఈ ఘటన స్థానికంగా విషాధం నింపింది.