ఆరు నెలల తర్వాత రోడ్డెక్కనున్న హైదరాబాద్ సిటీ బస్సులు: రేపట్నుంచే, కానీ
హైదరాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా సుమారు ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. శుక్రవారం(సెప్టెంబర్ 25) నుంచి హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రవాణా శాఖకు సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇండియా కోలుకుంటోంది: కరోనా టాప్-5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కీలకంగా, ఇదే కొనసాగితే..
రోడ్లపైకి 25 శాతం బస్సులే..
అయితే, హైదరాబాద్ నగరంలో 25 శాతం బస్సులను మాత్రమే నడిపేందుకు సీఎం అనుమతించారు. పరిస్థితిని బట్టి దశలవారీగా బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు. కాగా, హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు సర్వీసులపై గురువారం సీఎం కేసీఆర్తో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ చర్చించారు.
కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..
ఈ నేపథ్యంలో నగరంలో బస్సులు నడిపేందుకు సీఎం కేసీఆర్ అనుమతిచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఏయే రూట్లలో బస్సులు నడపాలనే దానిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలుత బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు.
హైదరాబాద్ నగరంలోనూ కరోనా కేసులు అధికమే..
కాగా, హైదరాబాద్ నగరంలోనూ కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా అన్లాక్లో భాగంగా ప్రజల రవాణాకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సిటీ బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. కాగా, కర్ణాటక, మహారాష్ట్రకు కూడా శుక్రవారం నుంచే ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు
కాగా, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. టెస్టులు పెద్ద సంఖ్యలో చేయకపోయినప్పటికీ.. చేసిన పరీక్షల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,79,246 కరోనా కేసులు నమోదు కాగా, 30,037 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1,48,139 మంది కోలుకున్నారు. 1070 మంది మరణించారు. 26 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.
Recommended Video