కరోనా షాక్: ఒక్క రోజుకే 1.15లక్షల బిల్లు.. ప్రైవేట్ ఆస్పత్రి దారుణం.. ప్రభుత్వ డాక్టర్ నిర్బంధం..
కరోనా వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాలను ప్రైవేటు ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటోన్న వైనం బయటపడింది. సాధారణ ప్రజలతోపాటు కరోనా వారియర్స్కూ అధిక బిల్లులతో చుక్కలు చూపెడుతున్నాయి. హైదరాబాద్ లో ఒక్క రోజు ట్రీట్మెంట్ చేసి లక్షల్లో బిల్లు వేసిందో ప్రైవేటు ఆస్పత్రి. ఇదేంటని ప్రశ్నించిన బాధితురాలిని నిర్బంధించింది. ఆ బాధితురాలు ఓ మెడికల్ ఆఫీసర్ కావడం గమనార్హం. కన్నీరుపెడుతూ ఆమె విడుదల చేసిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. దీనిపై చాదర్ ఘాట్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. వివరాల్లోకి వెళితే..
Recommended Video
తెలంగాణలో కొత్త కేసులు పెరుగుతోన్న దరిమిలా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ట్రీట్మెంట్ కు ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలో చాదర్ ఘాట్ లోని తుంబే ఆస్పత్రి కూడా కొవిడ్-19 సేవలు అందిస్తున్నది. అయితే, పేషెంట్లను భయపెట్టి మరీ వారి నుంచి భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారా ఆస్పత్రిలో. సిటీకే చెందిన ప్రఖ్యాత ఫివర్ ఆస్పత్రిలో డివిజనల్ మెడికల్ ఆఫీసర్(డీఎంవో)గా పనిచేస్తోన్న డాక్టర్ సుల్తానా ఈ విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా బయటపెట్టారు.
ప్రగతి భవన్లో కరోనా.. కేసీఆర్ కూ వైరస్ సోకిదంటూ ప్రచారం.. తెలంగాణలో 8రెట్లు పెరిగిన కేసులు..
డాక్టర్ సుల్తానాకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె తుంబే ఆస్పత్రికి వెళ్లారు. అదే అదనుగా ఆస్పత్రి వర్గాలు.. కేవలం 24 గంటల ట్రీట్మెంట్ కు ఏకంగా రూ.1.15లక్షల బిల్లు వేశారు. దీనిపై ప్రశ్నించిన సుల్తానా పట్ల అక్కడి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. అంతేకాదు, ఆమెను బలవంతంగా లాక్కెళ్లి ఓ గదిలో నిర్బంధించారు. తనకు జరిగిన దారుణాన్ని వివరిస్తూ సుల్తానా ఓ సెల్ఫీ వీడియోను రికార్డు చేశారు. సరైన చికిత్స అందించడం లేదని, ఆసుపత్రి వర్గాలు బాధిస్తున్నాయని ఆమె వాపోయారు.
ఎంబీటీ పార్టీకి చెందిన అమ్జదుల్లా అనే నాయకుడు.. డాక్టర్ సుల్తానా వీడియోను షేర్ చేస్తూ.. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తెలంగాణ డీజీపీలను ట్యాగ్ చేశారు. కొవిడ్ వారియరైన డాక్టర్ కే ఇంత దారుణమైన అనుభవం ఎదురైతే, సామాన్యుల మాటేంటని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరలైంది. అధిక బిల్లు వసూలు, బలవంతపు నిర్బంధంపై డాక్టర్ సుల్తానా చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఆరోగ్య శాఖ అధికారులుగానీ, ఇతర ప్రభుత్వ శాఖలుగానీ స్పందించాల్సిఉంది.