మళ్లీ భారీ క్యూలు... మీ సేవా కేంద్రాల వద్ద వరద బాధితుల రద్దీ... జీహెచ్ఎంసీ కమిషనర్ ట్విస్ట్...
జీహెచ్ఎంసీ ఎన్నికల కారణంగా హైదరాబాద్లో వరద సాయానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మూడు రోజుల తర్వాత డిసెంబర్ 7 నుంచి మళ్లీ వరద సాయం అందిస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం(డిసెంబర్ 7) వరద బాధితులు మళ్లీ మీ సేవా కేంద్రాల వద్దకు క్యూ కట్టారు. రాంగనర్,జీడిమెట్ల,కుత్బుల్లాపూర్,అల్వాల్,షాపూర్,సూరారం తదితర ప్రాంతాల్లోని మీ సేవా కేంద్రాల వద్ద వరద బాధితులు బారులు తీరారు.
మీసేవా కేంద్రాల వద్దకు రావొద్దు : జీహెచ్ఎంసీ కమిషనర్
మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ వరద బాధితులు మీ సేవా కేంద్రాల వద్దకు రావొద్దని నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని చెప్పడం గమనార్హం. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితుల వివరాలు సేకరిస్తాయని చెప్పారు. ఎవరికైతే సాయం అందలేదో వారి ఆధార్ కార్డు వివరాలు ధ్రువీకరించి వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. అయితే ఈ విషయమేదో ముందే చెప్తే... తెల్లవారుజామునే వచ్చి మీ సేవా కేంద్రాల వద్ద క్యూలో నిలుచునే అవసరం ఉండకపోయేది కదా అని బాధితులు వాపోతున్నారు.
అల్వాల్లో బాధితుల నిరసన
కొన్నిచోట్ల మీ సేవా కేంద్రాలను నిర్వాహకులు మూసివేశారు. అల్వాల్ మీ సేవా కేంద్రం తెరవకపోవడంతో బాధితులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. వరదల కారణంగా నష్టపోయిన తమను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే డిసెంబర్ 7 నుంచి మళ్లీ వరద సాయం అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్... ఇప్పుడు జీహెచ్ఎంసీ బృందాలతో సర్వే చేయిస్తానడమేంటని ప్రశ్నిస్తున్నారు.
Recommended Video
ఈసీ ఆదేశాలతో బ్రేక్...
ఈ ఏడాది అక్టోబర్లో సంభవించిన వరదలకు హైదరాబాద్లోని చాలా కాలనీల్లో ఉన్న ఇళ్లు నీట మునిగాయి. చాలామంది ఇంటి సామాగ్రి వరద నీళ్లల్లో కొట్టుకుపోయింది. దీంతో ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు రూ.10వేలు పరిహారం ప్రకటించింది. మొదట బాధితులకు నేరుగా డబ్బులు పంపిణీ చేసిన ప్రభుత్వం... ఆ తర్వాత మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంతలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల కారణంగా... ఎన్నికల కమిషన్ వరద సాయాన్ని నిలిపివేయాలని ఆదేశించడంతో దానికి బ్రేక్ పడింది.