హైదరాబాద్ లో కంపు కొడుతున్న కాలనీలు ... డేంజర్ బెల్స్ మోగిస్తున్న విష జ్వరాలు
హైదరాబాద్ లో కురిసిన వర్షాల కారణంగా నగరం మురికి కూపంగా తయారైంది . ఇటీవల కురిసిన వర్షాలకు వేలాది కాలనీలు నీటమునిగాయి. కాలనీలలో నీరు తగ్గినప్పటికీ బురద మాత్రం ఎక్కడికక్కడే పేరుకుపోయింది. దీంతో నగరవాసులు కంపుకొడుతున్న కాలనీల్లో, మురికి కూపంగా ఉన్న నగరంలో జీవనం సాగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుండి అన్ని ప్రాంతాల ప్రజలు వర్షాల కారణంగా నానా కష్టాలు పడుతున్నారు.అపరిశుభ్ర వాతావరణంలో , రోగాలతో సహజీవనం చేస్తున్నారు .
Recommended Video
హైదరాబాద్ కు వానగండం .. కష్టంగా మారిన సహాయక చర్యలు ..కట్టలు తెంచుకుంటున్న ప్రజాగ్రహం
వరదలతో సంకటంలో ప్రజారోగ్యం
భారీ వర్షాలు , వరద ముంపు కారణంగా నగరంలో చాలా కాలనీలు ఇప్పటికీ బురదమయం గానే ఉన్నాయి. హైదరాబాద్ లో 500కాలనీలకు పైగా నీట మునిగాయి.ఇక ఆయా కాలనీల్లో బురద, వరద , దుర్గంధం వెదజల్లుతూ ప్రజారోగ్యంతో ఆటలాడుతుంది . నీరజ్ కాలనీ, బాల్ రెడ్డి నగర్, ఫిలింనగర్, విరాహత్ నగర్ లలో పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. షహీన్ నగర్, ఉస్మాన్ నగర్ , ఓల్డ్ సిటీ లోని పలు ప్రాంతాలు కంపు కొడుతున్నాయి.ఇవి మచ్చుకు కొన్ని కాలనీలు మాత్రమే .
అపరిశుభ్ర వాతావరణం కారణంగా ప్రబలుతున్న విష జ్వరాలు
హైదరాబాద్లో పరిస్థితులను మామూలు స్థితికి తీసుకురావడం కోసం, అపరిశుభ్ర వాతావరణం లేకుండా చేయడం కోసం ఎన్డీఆర్ఎఫ్ , డీఆర్ఎఫ్ , జీహెచ్ఎంసీ సిబ్బంది బోట్లు, జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు .కానీ పునరావాస కేంద్రాలలో తాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో వరదల కారణంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రజలు విపరీతంగా జ్వరాలు, జలుబు, దగ్గులతో ఆసుపత్రుల బాట పడుతున్నారు.
కాచి చల్లార్చిన నీరే తాగాలి .. సీజనల్ వ్యాధులపై అలెర్ట్ చేస్తున్న వైద్యులు
వరదల కారణంగా వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కలరా, టైఫాయిడ్, గ్యాస్ట్రో ఎంటరైటిస్ వ్యాధులు విజృంభిస్తున్నాయి అని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఫీవర్ ఆసుపత్రి సూపరిండెంట్ శంకర్ చెప్తున్నారు. అంటువ్యాధుల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని సూచిస్తున్నారు. తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వర్షాలు వరదల కారణంగా పేరుకుపోయిన బురదతో విష జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్న పరిస్థితి కనిపిస్తుందని వైద్యులు అంటున్నారు.
విపరీతంగా ప్రబలుతున్న రోగాలు ... భాగ్యనగరంలో డేంజర్ బెల్స్
వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న అనేక మందికి సీఎం రిలీఫ్ కిట్లు కూడా అందడం లేదు. జబ్బులు ప్రబలకుండా కట్టడి చేసేందుకు మొబైల్ హెల్త్ టీంలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా వాటి సేవలూ అంతంతమాత్రంగానే అందుతున్నాయి. ప్రజలకు వైద్య సహాయం కూడా సరిగా అందక రోగాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. అసలే ఒక పక్క కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుండగా, మరోపక్క వరదల కారణంగా విషజ్వరాలు విజృంభిస్తున్న పరిస్థితి హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.