హైదరాబాద్ వరదలతో 'కారు'కు రివర్స్ గేర్: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు లేనట్టే
అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఇక ఎన్నికలకు వెళ్ళడమే తరువాయి అనుకున్నారు. ఈసారి ఎన్నికల్లో సైతం విజయ కేతనం ఎగుర వేస్తాము అని ధీమాగా ఉన్నారు. అంతలోనే హైదరాబాద్ ను ముంచెత్తిన వరదలు జిహెచ్ఎంసి ఎన్నికలపై ప్రభుత్వం పునరాలోచనలో పడేలా చేసింది. గులాబీ పార్టీ ఆశలపై నీళ్ళు పోశాయి. దీంతో ఎన్నికలకు ఇప్పట్లో వెళ్ళటం మంచిది కాదనే భావనలో టీఆర్ఎస్ పార్టీ ఉంది.
వరదల దెబ్బకు వ్యతిరేకత .. అంతర్మధనంలో అధికార పార్టీ
వర్షాలు, వరదల దెబ్బకు అధికార పార్టీపై , టిఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ల పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏకంగా కార్పొరేటర్ల మీద దాడికి దిగడం టీఆర్ఎస్ పార్టీని గందరగోళంలో పడేసింది. ఈ సమయంలో ఎన్నికలకు వెళితే తీవ్ర నష్టం జరుగుతుంది అన్న భావన పార్టీని అంతర్మధనంలో పడేసింది. భారీ వర్షాల కారణంగా గులాబీ పార్టీల్లో గుబులు పుడుతోంది. భారీ వర్షాలు, వరదలతో వేలాది కాలనీలు నీటమునిగాయి. ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కురిసిన వర్షాలు అధికార పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
మంత్రి కేటీఆర్ కు తప్పని వ్యతిరేకత
నిన్న మొన్నటి దాకా గ్రేటర్ ఎన్నికలకు దూకుడు పెంచిన టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాస్త నిదానంగా ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తోంది. ఏకంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి మరీ ప్రజల ఆందోళన కొనసాగిన వేళ ఎన్నికలకు వెళితే నష్టం జరుగుతుందని టిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఆరేళ్లుగా పాలన సాగిస్తున్న టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో కబ్జాలను, ఆక్రమణలను అడ్డుకోలేక పోయిందని, నాలాల పూడికతీత, నాలాల వెడల్పు వంటి అంశాలపై దృష్టి సారించలేదని ప్రజలు మండిపడుతున్నారు.
కార్పోరేటర్ల పనితీరుపై సర్వే ..
పన్నుల వసూళ్ల పై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యం పై లేదని, ప్రజా సమస్యలను పరిష్కరించటం పై లేదని నగర వాసులు మండిపడుతున్నారు. దీంతో ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్లాలంటేనే ప్రజా ప్రతినిధులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే కొద్ది రోజులు ఎన్నికలను పోస్ట్ పోన్ చేసినప్పటికీ ఈసారి ఎన్నికలకు ప్రస్తుతం ఎదురవుతున్న క్షేత్రస్థాయి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వెళ్లాలని భావిస్తోంది టిఆర్ఎస్ పార్టీ. సిట్టింగ్ కార్పొరేటర్లకు ప్రజాక్షేత్రంలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో కార్పొరేటర్ల పనితీరుపై సర్వేలు నిర్వహిస్తోంది.
Recommended Video
ఎన్నికల నిర్వహణపై పునరాలోచన .. ఇప్పట్లో లేనట్టే
ఎన్నికల బరిలోకి దింపాల్సిన అభ్యర్థుల ఎంపిక కోసం కూడా కసరత్తు మొదలు పెట్టింది. ఏది ఏమైనా గ్రేటర్ హైదరాబాద్ లో నవంబర్, డిసెంబర్ నెలలలో మొదట ఎన్నికలకు వెళ్లాలని భావించిన అధికార పార్టీ ఇప్పుడు కొద్ది రోజులు వెనక్కి తగ్గే ఆలోచనలో ఉంది. వరద ప్రభావం తగ్గి, పరిస్థితి మెరుగుపడి తర్వాత, ప్రజలను మళ్లీ తమ వైపు తిప్పుకోవాలన్న ఆలోచనలో టిఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలి అన్న అంశంపై మంత్రులు, ఇన్చార్జులు ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు గా సమాచారం. ఏది ఏమైనా అధికార పార్టీ అనుకున్నది ఒకటైతే వరదల కారణంగా అయ్యింది ఇంకొకటి.