హైదరాబాద్ వాసులకు నిద్రలేని రాత్రులు: నిమిషాల్లోనే వరదనీరు ఇళ్లల్లోకి(వీడియో)
హైదరాబాద్: గత పది రోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. ఇప్పటికే నగరంలోని దాదాపు సగ భాగం వరద నీటిలోనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వర్షాల వల్ల పంట నష్టాన్ని అంచనా వేసిన పవన్ కల్యాణ్: ఇళ్లల్లోనే ఉండండి..బయటికి రావొద్దంటూ
దిక్కుతోచని స్థితిలో నగర ప్రజలు
ఇప్పటికే వరదనీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగర ప్రజలకు.. మరో రెండ్రోజుల వాన పడుతుందనే వార్త బెంబేలెత్తిస్తోంది. బుధవారం కూడా అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో వరదనీరు లోతట్టు ప్రాంతాను ముంచేస్తోంది. ఇళ్లళ్లోకి నీరు చేరుకుంటుండటంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. తాజాగా, కొన్ని ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాల దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
నిమిషాల్లోనే ఇళల్లలోకి వరదనీరు..
గత శనివారం రాత్రి ఓ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే వరద నీరు ఇళ్లల్లోకి ఎలా చేరిపోతుందో తెలుస్తోంది. హఫీజ్నగర్, ఒమర్ కాలనీ, ఫూల్ బాగ్, ఇండియా నగర్, రాజీవ్ నగర్, శివాజీ నగర్ ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షంతో శనివారం రాత్రి భారీగా వరద నీరు చేరుకుంది. చాంద్రయాణగుట్టలోని ఓ ఇంట్లోకి వరద నీరు కేవలం 30 నిమిషాల్లోనే పెద్ద ఎత్తున చేరుకోవడం సీసీ కెమెరాల్లో రికార్డైంది.
నిద్రపోవాలంటేనే భయపడుతున్నారు..
చాంద్రయాణగుట్ట ప్రాంతంలోని ఓ వీధిలో కూడా అక్టోబర్ 18న ఉదయం 3 గంటల సమయంలో ఒక్కసారిగా వరద నీరు భారీగా పెరిగినట్లు సీసీకెమెరాల్లో రికార్డైన దృశ్యాలు ద్వారా తెలుస్తోంది. ఇళ్ల గేట్ల ఎత్తువరకు వరద నీరు రావడం గమనార్హం. దీంతో ప్రజలు రాత్రి నిద్రపోవాలంటేనే భయాందోళనలకు గురవుతున్నారు. ఇలా చాలా వీధులు, నివాసాల్లోకి వరద నీరు చేరుతుండటంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
సహాయక చర్యలు ముమ్మరం
ఈ నేపథ్యంలో ప్రభుత్వ వరద బాధితుల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ. 10 వేలు అందజేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జీహెచ్ఎంసీ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల పరిస్థితిని తెలుసుకుంటున్నారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
Recommended Video
హైదరాబాద్ చరిత్రలో రెండో అతిపెద్ద వాన
కాగా, 1908 తర్వాత హైదరాబాద్ నగరంలో తొలిసారి ఇంత భారీ స్థాయిలో వర్షం పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. సుమారు 70 మంది ప్రజలు వరదల కారణంగా మృతి చెందారు. 37వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.