హైదరాబాద్: వరదనీటిలో కొట్టుకుపోయిన నవీన్ మృతదేహం సరూర్నగర్ చెరువులో లభ్యం
హైదరాబాద్: నగరంలోని సరూర్నగర్ సమీపంలో ఆదివారం సాయంత్రం వరదనీటిలో పడి కొట్టుకుపోయిన నవీన్(45) మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. సుమారు 20 గంటలపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సరూర్నగర్ చెరువులో గాలించగా.. ఘటన జరిగిన వంద మీటర్ల దూరంలో అతని మృతదేహం లభ్యమైంది.
హైదరాబాద్ వర్షాలు: అందరూ చూస్తుండగానే వరదనీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి(వీడియో)
నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం తపోవన్ కాలనీ వద్ద ప్రమాదవశాత్తూ వరదలో పడి నవీన్ కొట్టుకుపోయాడు. స్థానికులు అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ సిబ్బంది ఆదివారం అర్ధరాత్రి వరకు గాలింపు చేపట్టారు. నవీన్ ఆచూకీ లభించకపోవడంతో తిరిగి సోమవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టగా.. అతని మృతదేహం లభించింది.
కాగా, ఇటీవల నేరెడ్మెట్లో కూడా సుమేధ అనే బాలిక తన సైకిల్తో వరదలో కొట్టుకుపోయింది. ఆమె మృతదేహం సమీపంలోని చెరువులో లభ్యమైంది. ఈ రెండు ఘటనలతో అధికారులపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు పడుతున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఇలాంటి విషాద ఘటనలో చోటు చేసుకుంటున్నాయని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓపెన్ నాలాల ప్రమాదాన్ని గుర్తించిన మంత్రి.. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ నాలాలపై కప్పులు వేసి మూసివేయాలని ఆదేశించారు.
రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై క్యాపింగ్ నిర్మాణం చేస్తామని, అదే రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న నాలాలకు సంబంధించి సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యూనల్ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.