హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు ఇలా.. గూగుల్ మ్యాప్లో తొలిసారిగా శోభాయాత్ర
Recommended Video
హైదరాబాద్ : నవ రాత్రులు పూజలందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్దమయ్యాడు. నిమజ్జన పర్వం తుది ఘట్టానికి చేరుకోవడంతో భాగ్యనగరంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇటు జీహెచ్ఎంసీ అధికారులు.. అటు పోలీస్ శాఖ ఏర్పాట్లలో తలమునకలైంది. గణేశుడి నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా ప్రభుత్వ యంత్రాంగాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. గురువారం నాడు నిమజ్జన కార్యక్రమం చివరి దశ పూర్తి కానుంది. అదలావుంటే ఈసారి తొలిసారిగా హైదరాబాద్లో వినాయక శోభాయాత్రను గూగుల్ మ్యాప్లో వీక్షించే అవకాశం దక్కనుంది.
భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం.. భారీగా ఏర్పాట్లు
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనానికి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం (11.09.2019) నాడు లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. భాగ్యనగరంలో వినాయక నవరాత్రులు మొదలు మూడో రోజు నుంచే నిమజ్జనం జరుగుతుంటుంది. అయితే చివరి ఘట్టం మాత్రం గురువారం నాటితో పూర్తి కానుంది. ఆ క్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు అలర్టయ్యారు. గణేశ్ నిమజ్జనం సవ్యంగా, సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.
గణేశ్ నిమజ్జనం చివరి ఘట్టంలో భాగంగా హైదరాబాద్ అంతటా దాదాపు 391 కిలోమీటర్ల మేర నిమజ్జన పర్వం కొనసాగనుంది. ఆ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ శాఖ, జలమండలి, శానిటేషన్ తదితర ప్రభుత్వ విభాగాల సిబ్బంది వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక గణేశ్ యాక్షన్ టీమ్ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సందర్శకులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 04027852482 , 9490598985 ,9010203626 హెల్ప్లైన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
మంత్రి పదవి.. ఆదిలాబాద్ టు కరీంనగర్ షిఫ్ట్.. ఎందుకంటే..!
తొలిసారిగా గూగుల్ మ్యాప్లో శోభాయాత్ర
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనానికి సంబంధించి హుస్సేన్ సాగర్ దగ్గర ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అదే క్రమంలో నగరంలోని పలు చెరువులను కూడా అధికారులు సిద్ధం చేశారు. నగరం నలుమూలలా సాగే వినాయక శోభాయాత్రను తొలిసారిగా గూగుల్ మ్యాప్ ద్వారా ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం దక్కనుంది. శోభాయాత్రను ఎప్పటికప్పుడూ అప్డేట్ చేయడం ద్వారా ఆన్లైన్లో పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.
ప్రభుత్వ విభాగాల అధికారులు ఏర్పాట్లలో బిజీబిజీ
హైదరాబాద్లో దాదాపు 391 కిలోమీటర్ల మేర జరగనున్న నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి పలు ప్రభుత్వ విభాగాల అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. నగరమంతటా దాదాపు 32 ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించారు. అలాగే 27 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిబ్బంది 2100 మంది నిమజ్జనంలో డ్యూటీ చేయనున్నారు. అలాగే 134 మొబైల్ క్రేన్లతో పాటు 93 స్టాటిక్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. అదలావుంటే 66 ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. నిమజ్జనం సందర్భంగా 550 స్పెషల్ బస్సులను నడపనుంది ఆర్టీసీ.
హుస్సేన్ సాగర్తో పాటు చెరువులు సిద్ధం
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం సాఫీగా జరగడానికి జీహెచ్ఎంసీ దాదాపు 20 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు పూర్తి చేసింది. నిమజ్జనం జరిగే చెరువుల దగ్గర భద్రత నిమిత్తం గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సరూర్నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువుల దగ్గర ప్రత్యేకంగా 3 బోట్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్, సరూర్నగర్ మినీ ట్యాంక్ బండ్ దగ్గర కేంద్ర విపత్తు నివారణ దళాల సేవలు. పర్యాటక శాఖ ద్వారా హుసేన్ సాగర్లో 7 బోట్లు, 44 స్పీడ్ బోట్లతో పాటు హుస్సేన్ సాగర్ దగ్గర పదిమంది గజ ఈత గాళ్లను సిద్ధం చేశారు. ఇక సందర్శకుల కోసం 115 వాటర్ క్యాంపుల ద్వారా 30 లక్షలకు పైగా వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్లో వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించేలా దాదపు వెయ్యి మందిని నియమించారు.
పంచాయతీలకు కరెంట్ షాక్.. గ్రామాల్లో చీకట్లేనా?
ఖైరతాబాద్ పెద్ద గణేశుడు ఈసారి సంపూర్ణ నిమజ్జనం
ఖైరతాబాద్ మహా గణపతిని ఈసారి కూడా తొలుత నిమజ్జనం చేయనున్నారు. ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 6 దగ్గరకు ఖైరతాబాద్ పెద్ద గణేశుడు చేరుకోనున్నాడు. అనంతరం అన్నీ కార్యక్రమాలు ముగించి మధ్యాహ్నం ఒంటి గంట లోపే నిమజ్జనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి మహా గణపతిని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు క్రేన్ నెంబర్ 6 దగ్గర 20 ఫీట్లకు పైగా లోతు పెంచినట్లు మంత్రి తలసాని తెలిపారు.