బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్.. నాలుగు రోజులాయే జాడలేక.. నిందితుడు మోస్ట్ వాంటెడ్..!
హైదరాబాద్ : హయత్ నగర్ బీఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ జరిగి నాలుగు రోజులవుతోంది. అయినా నిందితుడు మాత్రం ఇంతవరకు పట్టుబడలేదు. మాయమాటలతో ఆ విద్యార్థిని కుటుంబాన్ని నమ్మించి చాకచక్యంగా అపహరించాడు. అయితే సదరు మోసగాడు తాను దొరక్కుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మేరకు కొన్ని విషయాలు కూడా సేకరించారు. అదలావుంటే నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కూతురు జాడ కానరాక.. నాలుగు రోజులవుతున్నా ఆచూకీ దొరక్క తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
టెక్నాలజీ వాడుతూ కొన్ని కేసులను సులభంగా చేధిస్తున్న పోలీసులు ఈ కేసులో మాత్రం డీలా పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం నాడు ఆ విద్యార్థిని కిడ్నాప్కు గురైతే శుక్రవారం నాటికి కూడా ఆమె ఆచూకీ దొరకకపోవడం గమనార్హం.
ఉద్యోగం ఇప్పిస్తానంటూ కిడ్నాప్..!
నల్గొండ జిల్లా కొండ మల్లెపల్లికి చెందిన ఎలిమినేటి యాదయ్య నగర శివారు బొంగుళూరు గేటు సమీపంలో టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆ క్రమంలో మంగళవారం (23.07.2019 ) నాడు ఉదయం యాదయ్య టీ స్టాల్ దగ్గరకు శ్రీధర్ రెడ్డి అనే పేరుతో ఓ వ్యక్తి కారులో వచ్చాడు. ఆయన దగ్గర టీ తాగుతూ మాటలు కలిపాడు. అలా కుటుంబ వివరాలు సేకరించిన సదరు మోసగాడు బీఫార్మసీ చదువుతున్న తన పెద్ద కూతురు 21 సంవత్సరాల సోనికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు.
కూతురికి ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో యాదయ్య తన కూతురు సోనితో పాటు కొడుకు డేవిడ్ను వెంటబెట్టుకుని శ్రీధర్ రెడ్డి కారులో బయలుదేరారు. అలా కొద్ది దూరం ప్రయాణించాక డేవిడ్ను బిఎన్ రెడ్డి నగర్ దగ్గర దింపేశాడు శ్రీధర్ రెడ్డి. అనంతరం యాదయ్యతో పాటు సోని ని నగరమంతా తిప్పాడు. ఆ క్రమంలో సోనికి సంబంధించిన పూర్తి వివరాలు తెల్ల కాగితం మీద రాయించి దాన్ని జిరాక్స్ తీసుకురావాల్సిందిగా యాదయ్యను కోరాడు.అలా ఆయన కారు దిగగానే సోనితో సహా ఉడాయించాడు.
రెండు రోజులాయే.. బీఫార్మసీ విద్యార్థిని జాడ లేదు.. కొలిక్కిరాని కిడ్నాప్..!
కారులో వచ్చాడు.. నమ్మించి మోసం చేశాడు
సోని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ క్రమంలో కిడ్నాపర్కు సంబంధించిన కొన్ని కీలక విషయాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. అసలు వాడి పేరు శ్రీధర్ రెడ్డి కాదని గుర్తించారు. విజయవాడకు చెందిన రవిగా నిర్దారించారు. అంతేకాదు ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి కీలక విషయాలు సేకరించినట్లు సమాచారం.
కారులో వచ్చి దర్జా ఒలకబోసిన సదరు నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా గుర్తించారు పోలీసులు. మూడు రాష్ట్రాల పోలీసులు వాడి కోసం జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడూ చాకచక్యంగా తప్పించుకుంటూ నిందితుడు పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. అయితే ఈ కేసులో వాడు వాడిన కారు గురించి ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. శ్రీధర్ రెడ్డి అలియాస్ రవి ఆ కారును కూడా దొంగిలించినట్లు రుజువైంది. కారు నెంబర్ తదితర వివరాలతో ట్రేస్ చేయగా అసలు యజమాని పోలీసుల దగ్గరకు రావడంతో గుట్టురట్టైంది.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. తల్లిదండ్రుల్లో ఆందోళన
కిడ్నాప్ జరిగి నాలుగు రోజులవుతున్నా కూతురు జాడ కానరాక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అదలావుంటే ఆ విద్యార్థిని ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని.. యువతిని క్షేమంగా అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నప్పటికీ అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. ఈ కేసును సీరియస్గా తీసుకున్న ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ ఆమె తండ్రి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. వీలైనంత తొందరగా కేసు చిక్కుముడి విప్పుతామంటున్నారు.
సోని ని కిడ్నాప్ చేసింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తేలడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్గా మారినోడు సోనికి ఏమైనా హాని తలపెట్టాడా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా నిందితుడిని ట్రేస్ చేసి ఆ విద్యార్థినిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగిస్తామంటున్నారు పోలీసులు.