రెండు రోజులాయే.. బీఫార్మసీ విద్యార్థిని జాడ లేదు.. కొలిక్కిరాని కిడ్నాప్..!
హైదరాబాద్ : మంగళవారం నాడు హయత్ నగర్ ప్రాంతంలో కిడ్నాపయిన బీఫార్మసీ విద్యార్థిని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యువతి కిడ్నాప్ జరిగి రెండు రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు ఆమె జాడ కానరాకపోవడం పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. మరోవైపు తమ బిడ్డ ఆచూకీ తెలియక టెన్షన్ పడుతున్నారు తల్లిదండ్రులు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని.. యువతిని క్షేమంగా అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నప్పటికీ అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి.
ఆ క్రమంలో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. హయత్ నగర్లో యువతి అదృశ్యం కేసును సీరియస్గా తీసుకున్న ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ ఆమె తండ్రి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. వీలైనంత తొందరగా కేసు చిక్కుముడి విప్పుతామంటున్నారు.
కారులో వచ్చాడు.. మాట కలిపాడు.. యువతిని కిడ్నాప్ చేశాడు
నల్గొండ జిల్లా కొండ మల్లెపల్లికి చెందిన ఎలిమినేటి యాదయ్య నగర శివారు బొంగుళూరు గేటు సమీపంలో టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అతడికి ఇద్దరు కూతుళ్లతో పాటు ఒక కొడుకు ఉన్నాడు. 21 సంవత్సరాల పెద్ద కూతురు సోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. కొడుకు డేవిడ్ ఇంటర్మీడియట్లో ఉన్నాడు. అయితే మంగళవారం ఉదయం పూట ఓ వ్యక్తి కారులో వచ్చాడు. యాదయ్య టీ స్టాల్ దగ్గర కారు ఆపి టీ తాగాడు. ఆ క్రమంలో యాదయ్యతో మాటలు కలుపుతూ కుటుంబ వివరాలు సేకరించాడు.
డ్యాన్స్ మాస్టర్ స్టెప్పులు.. 9వ తరగతి బాలిక ఫిదా.. ప్రేమనా, కిడ్నాపా?
Recommended Video
కన్నింగ్ మాటలతో పల్టీ.. యువతి మాయం
శ్రీధర్ రెడ్డిగా తనకు తాను పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి యాదయ్యను మాటలతో బోల్తా కొట్టించాడు. తమది ఉన్నతవంతమైన ఫ్యామిలీ అని ఫోజులు కొట్టాడు. అలా యాదయ్య పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానంటూ నమ్మించాడు. వచ్చినవాడు ఎవడో తెలియకుండా గుడ్డిగా నమ్మేసిన యాదయ్య.. వాడు చెప్పిన మాటలకు అట్రాక్ట్ అయ్యాడు.
మధ్యలో తండ్రీకొడుకులను దింపేసి.. యువతితో పరార్..!
ఆ క్రమంలో తన ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో శ్రీధర్ రెడ్డిని ఫాలో అయ్యాడు యాదయ్య. అతడు చెప్పిన ప్రకారం యాదయ్యతో పాటు పెద్ద కుమార్తె సోని, కుమారుడు డేవిడ్తో కలిసి కారులో బయలుదేరారు. అలా కొద్ది దూరం ప్రయాణించాక డేవిడ్ను బిఎన్ రెడ్డి నగర్ దగ్గర దింపేశాడు. అనంతరం యాదయ్యతో పాటు సోని ని నగరమంతా తిప్పాడు.
ఆ క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో హయత్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర కారు ఆపాడు. సోనికి సంబంధించిన పూర్తి వివరాలు తెల్ల కాగితం మీద రాయించి దాన్ని జిరాక్స్ తీసుకురావాల్సిందిగా యాదయ్యను పంపించాడు. జస్ట్ ఆయన కారు దిగగానే సోనితో సహా ఉడాయించాడు సదరు వ్యక్తి. దాంతో మంగళవారం రాత్రంతా తన కూతురు జాడ కోసం చూసిన యాదయ్య మరునాడు బుధవారం హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.