అక్క-బావ కళ్లల్లో ఆనందం కోసమే... అరగంట ఆలస్యమై ఉంటే హేమంత్ బతికేవాడు...
రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య తరహాలోనే... తాజాగా హైదరాబాద్లో చోటు చేసుకున్న హేమంత్ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. హత్యకు ప్రధాన సూత్రధారి అవంతి మేనమామ యుగంధర్ రెడ్డే అని ఇప్పటికే గుర్తించిన పోలీసులు మరిన్ని కీలక ఆధారాలను సంపాదించారు. హత్య చేయాలన్న ఆలోచన ఎప్పుడు.. ఎలా మొదలైందన్న దానికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.
నా భర్తను చంపినవాళ్లను ఎన్కౌంటర్ చేయండి: ఇలా అనుకోలేదంటూ హేమంత్ భార్య అవంతి
బావ-అక్క కళ్లలో ఆనందం కోసం...
తన అక్క అర్చన,బావ లక్ష్మారెడ్డి కళ్లల్లో ఆనందం కోసమే యుగంధర్ రెడ్డి హేమంత్ హత్యకు పూనుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అవంతి హేమంత్ను కులాంతరం వివాహం చేసుకుని వెళ్లిపోయాక... బావ లక్ష్మారెడ్డి,అక్క అర్చనల బాధను చూడలేక హేమంత్ను చంపేద్దామని ఆ ఇద్దరితో ప్రతిపాదించినట్లు గుర్తించారు. అందుకు వాళ్లు అంగీకరించడంతో హత్య ఎక్కడ ఎలా చేయాలి... ఎవరితో చేయించాలన్న స్కెచ్ యుగంధర్ రెడ్డే వేసినట్లు నిర్దారించారు.
ఏ అనుమానం రాకుండా...
ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే ఏ అనుమానం రాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో గురువారం(సెప్టెంబర్ 24) అందరినీ వెంటపెట్టుకుని యుగంధర్ రెడ్డి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉన్న హేమంత్-అవంతి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇద్దరిని కారులో బలవంతంగా ఎక్కించాక... కుటుంబ సభ్యులు,బంధువులను ఇంటికి పంపించేశాడు. అనంతరం వాహనాన్ని ఓఆర్ఆర్ వైపు తిప్పగా... మార్గమధ్యలో ఇద్దరు కిందకు దూకి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో అవంతి తప్పించుకోగా... హేమంత్ను మాత్రం కొట్టుకుంటూ తీసుకెళ్లి మళ్లీ కారు ఎక్కించారు.
లొంగిపోయిన ఇద్దరు నిందితులు...
ఓఆర్ఆర్ నుంచి జహీరాబాద్ వెళ్లి... అక్కడ మద్యం సేవించి... ఓ తాడును కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అదే తాడుతో హేమంత్ గొంతు నులిమి హత్య చేసినట్లు గుర్తించారు. కిరాయి మనుషులతో కలిసి యుగంధర్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్దారించారు. నిందితులు ఎరుకల కృష్ణ,మహ్మద్ పాషాలు శనివారం మధ్యాహ్నం స్వయంగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పరారీలో ఉన్న జగన్,సయ్యద్ అనే నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు.
అరగంట ఆలస్యమై ఉంటే...
నిజానికి గురువారం ఉదయం తాము గీతం యూనివర్సిటీకి వెళ్లి తన సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలని భావించినట్లు అవంతి తెలిపారు. అక్కడికి వెళ్లేందుకు సిద్దమవుతున్న తరుణంలోనే తమ కుటుంబ సభ్యులు వచ్చారన్నారు. వాళ్లు ఒక్క అరగంట ఆలస్యంగా వచ్చి ఉంటే... తాము యూనివర్సిటీకి వెళ్లిపోయేవాళ్లమని,హేమంత్ ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే జనవరిలో లండన్ వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నామని... అందుకోసం తన సర్టిఫికెట్స్ అవసరం కావడంతో యూనివర్సిటీకి వెళ్లాలనుకున్నట్లు చెప్పారు. రంజిత అనే బంధువు తనకు ఫోన్ చేసి... మా ఫ్యామిలీ వస్తున్నట్లు చెప్పడంతో ఇంట్లోనే ఆగిపోయినట్లు తెలిపారు. అయితే ఇంత దారుణానికి ఒడిగడుతారని ఊహించలేదని... అమ్మానాన్నలతో సహా అందరినీ ఉరికంబం ఎక్కించాలని పోలీసులను వేడుకుంటున్నానని చెప్పారు.
Recommended Video
ఉరితీయాలని హేమంత్ సోదరుడు సుమంత్ డిమాండ్
హంతకులందరినీ ఉరితీయాలని హేమంత్ సోదరుడు సుమంత్ డిమాండ్ చేశారు. హేమంత్ హత్యతో ఆయన లండన్ నుంచి వచ్చారు. తన సోదరుడి పెళ్లయ్యాక అవంతి ఫ్యామిలీ అర్ధరాత్రులు అతనికి ఫోన్ చేసి బెదిరించేవారని చెప్పారు. లండన్లో ఉన్న తనను కూడా ఫోన్ చేసి బెదిరించినట్లు చెప్పారు. నిజానికి హేమంత్-అవంతి కూడా లండన్ వచ్చే ప్లాన్లో ఉన్నారని తెలిపారు. హేమంత్ ఇంటీరియర్ డిజైనర్ కావడంతో ముందుగా ఒప్పుకున్న డీల్స్ను డిసెంబర్ రెండో వారానికి పూర్తి చేసి... ఆ తర్వాత లండన్ ఏర్పాట్లు చేసుకోవాలనుకున్నట్లు పేర్కొన్నారు. అమ్మానాన్నను కూడా లండన్కే తీసుకెళ్దామని హేమంత్ తనతో చెప్పినట్లు సోదరుడు సుమంత్ తెలిపారు.