రాత్రి బర్త్ డే పార్టీ... తెల్లారేసరికి బెడ్పై విగతజీవిగా... హైదరాబాద్లో విషాదం...
హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి బర్త్ డే పార్టీ జరుపుకున్న ఓ యువకుడు తెల్లారేసరికి విగతజీవిగా కనిపించాడు. హాస్టల్ గదిలో బెడ్పై నిద్రలోనే మృతి చెందాడు. బర్త్ డే పార్టీలో అతిగా మద్యం సేవించడంతో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
Recommended Video
వివరాల్లోకి వెళ్తే... తమిళనాడులోని ముళ్లిపట్టుకు చెందిన కేశవ ప్రసాద్ (28) స్థానికంగా ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడు. కంటోన్మెంట్ పరిధిలోని గోపాలపురంలో ఉన్న ఓ హాస్టల్ లో ఉంటున్నాడు. ఫిబ్రవరి 15న అతని బర్త్ డే కావడంతో ఆరోజు రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ సందర్భంగా అతిగా మద్యం సేవించాడు. పార్టీ అనంతరం అర్ధరాత్రి హాస్టల్ గదికి వచ్చి తన బెడ్పై నిద్రపోయాడు.
మరుసటిరోజు మంగళవారం(ఫిబ్రవరి 16) చాలాసేపటివరకూ నిద్ర లేవలేదు. దీంతో పక్క గదిలో ఉండే స్నేహితులకు అనుమానం వచ్చింది. చాలాసార్లు తలుపు కొట్టినా తీయలేదు. దీంతో హాస్టల్ నిర్వాహకులకు సమాచారమిచ్చారు. అంతా కలిసి తలుపును పగలగొట్టి లోపలికి వెళ్లారు. లోపల హాస్టల్ బెడ్పై కేశవ ప్రసాద్ విగతజీవిగా కనిపించాడు. అయితే అతని శరీరంపై ఎక్కడా ఎలాంటి గాయాలు లేవు. అతిగా మద్యం సేవించడం వల్ల నిద్రలోనే బ్రెయిన్ డెడ్ అయి చనిపోయి ఉండొచ్చునని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టమ్ రిపోర్ట్ వస్తేనే ఏం జరిగిందన్నది చెప్పగలమని పోలీసులు వెల్లడించారు.
ఇలా అతిగా మద్యం సేవించడం వల్ల బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన ఘటనలు గతంలోనూ అనేకం చోటు చేసుకున్నాయి. గతేడాది జనవరిలో నిజామాబాద్లోని దర్పల్లి గ్రామంలో కాశయ్య(35) అనే వ్యక్తి ఇలాగే అతిగా మద్యం సేవించి నిద్రలోనే బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. తెల్లవారుజామున కాశయ్య భార్య అతన్ని నిద్ర లేపేందుకు ప్రయత్నించగా విగతజీవిగా కనిపించాడు. అరగంటలో ఫుల్ బాటిల్ ఖాళీ చేస్తానని స్నేహితులతో పందెం కాయడమే అతని ప్రాణాల మీదకు తెచ్చింది.