పళ్ళు ఎత్తుగా ఉన్నాయని భార్యకు తలాక్ చెప్పిన భర్త ... న్యాయం కోసం భార్య ఫిర్యాదు
ముస్లిం మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న ట్రిపుల్ తలాక్ నిషేధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా తలాక్ పేరుతో ముస్లిం మహిళలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ముస్లిం సామాజిక వర్గం నేటికీ విడాకులు తీసుకోవడానికి ట్రిపుల్ తలాక్ చెప్పి పాత విధానాన్ని అనుసరిస్తుందని తాజాగా కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ముస్లిం మహిళల పట్ల శాపంగా మారిన ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినప్పటికీ ఈ పద్ధతికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.
నార్సింగిలో మహిళ కిడ్నాప్, అత్యాచారం
ముఖ్యంగా ముస్లింలు తమకు ఉన్న వెసులుబాటును ఉపయోగించి విచిత్ర కారణాలను తెలుపుతూ కొందరు ట్రిపుల్ తలాక్ చెబుతూ ఆ సామాజిక వర్గం లో మహిళల పరిస్థితిని అగమ్యగోచరంగా తయారు చేస్తున్నారు . అదే కోవలో తాజాగా మరో ఘటన జరిగింది.పెళ్లైన మూడు నెలలకే ఒక భర్త తనకు ఆ భార్య వద్దంటూ తన భార్యకు దంతాలు సరిగా లేవంటూ ట్రిపుల్ తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. దీంతో ఆ భార్య లబోదిబోమంటుంది. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటనలో ముస్తఫా అనే వ్యక్తి తన భార్య రుక్సానా కు పళ్లు ఎత్తుగా ఉన్నాయన్న కారణంతో మూడు సార్లు తలాక్ చెప్పి ఇక భార్యతో తనకు సంబంధం లేదని వెళ్లిపోయాడు.
పెళ్లైన మూడు నెలలకే రుక్సానాకు భర్త తలాక్ చెప్పడంతో ఆమె తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భర్త తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన రుక్సానా, తలాక్ చెప్పిన కారణంగా భర్త వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించినా,తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని భర్త చెప్తున్నారని వాపోతోంది. కేవలం పళ్ళు సరిగ్గా లేవని ట్రిపుల్ తలాక్ చెప్పి వెళ్లి పోవడం అన్యాయమని, తనకు న్యాయం కావాలని కోరుతోంది.
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో రుక్సానా ఫిర్యాదు చెయ్యగా 498A క్రింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ట్రిపుల్ తలాక్ నిషేధిస్తూ కేంద్రం చట్టం చేసిన నేపథ్యంలో రుక్సానా కు తలాక్ చెప్పిన భర్త ముస్తఫా కు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. శిక్ష విషయం పక్కన పెడితే రుక్సానాను తిరిగి ముస్తఫా భార్యగా ఒప్పుకుంటాడా? వారిద్దరూ కలిసి కాపురం చేస్తారా? అన్నది ప్రస్తుతం పెద్ద ప్రశ్న.