Hyderabad Mayor పదవి కోసం బీజేపీ ఫైట్: రాధా ధీరజ్ రెడ్డి సహా: ఇద్దరి పేర్లు ఇవే
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్సొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా అంచనాలకు మించి రాణించిన భారతీయ జనతా పార్టీ.. మేయర్ పదవిపై కన్నేసింది. ప్రథమ పౌరురాలి రేసులు నిల్చోబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లాగే.. అనూహ్య ఫలితాన్ని పొందుతామని ధీమా కమల నాథుల్లో వ్యక్తమౌతోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి దిమ్మతిరిగేలా షాకిస్తామని, దీనికి అవసరమైన వ్యూహాలన్నీ సిద్ధం చేసుకున్నామని స్పష్టం చేస్తున్నారు.
మేయర్ అభ్యర్థిత్వం కోసం..
ఈ సారి హైదరాబాద్ మేయర్ పదవి మహిళలకు రిజర్వ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముగ్గురి పేర్లను బీజేపీ పరిశీలిస్తోంది. రామకృష్ణాపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి ప్రధానంగా వినిపిస్తోంది. బీజేపీ మేయర్ పదవి కోసం ఆమె పేరును ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. రాధా ధీరజ్ రెడ్డితో పాటు మోండా మార్కెట్, వినాయక్ నగర్ కార్పొరేటర్లు దీపికా, రాజ్యలక్ష్మి పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకుంది. రాధా ధీరజ్ రెడ్డి పేరును ఖాయం చేశారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా టీఆర్ఎస్కు తమ సత్తా చూపించడానికైనా బరిలో నిల్చోక తప్పదని తీర్మానించుకుంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో..
గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. 150 స్థానాల్లో ఉన్న జీహెచ్ఎంసీలో బీజేపీ అనూహ్య ఫలితాలను సాధించింది. ఏకంగా 48 డివిజన్లను గెలుచుకోగలిగింది. ఇదివరకటితో పోల్చుకుంటే... ఇది ఎన్నో రెట్లు అధికం. గతంలో నాలుగు కార్పొరేటర్ స్థానాలకే పరిమితం కాగా ఈ సారి ఈ సంఖ్య 48కి చేరింది. టీఆర్ఎస్ 56 చోట్ల గెలిచింది. ఏఐఎంఐఎం ఎప్పట్లాగే తన పట్టును నిలుపుకొంది. 44 డివిజన్లను సొంతం చేసుకుంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం ప్రబావాన్ని చూపలేకపోయాయి. కాంగ్రెస్ రెండు చోట్ల మాత్రమే గెలవగా.. టీడీపీ ఖాతా తెరవలేకపోయింది.
భాగ్యలక్ష్మి ఆలయం కాదిక..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి ముందు.. ఆ తరువాత.. బీజేపీ నాయకులు పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద కొత్త కార్పొరేటర్లతో ప్రమాణం కూడా చేయించారు. అవినీతి రహిత రాజకీయాలు చేస్తామంటూ అమ్మోరి మీద ఒట్టు వేశారు. ఈ సారి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లట్లేదు. బషీర్ బాగ్ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయానికి బయలుదేరి వెళ్తారు.