మందుబాబులకు మెట్రో రైల్ బంపర్ ఆఫర్.. డ్రంకెన్ డ్రైవ్ కూడా ఎత్తేయాలని..
ఈ ఏడాది కూడా మెల్లగా కాలం ఒడిలోకి జారుకుంది. నూతన ఉత్సాహాన్ని నింపడానికి కొత్త సంవత్సరం ఎదురుచూస్తోంది. ఈ దశాబ్దిలో చివరి సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ.. హ్యాపీగా న్యూ ఇయర్ ను స్వాగతం పలకడానికి ప్రజలంతా రెడీ అయ్యారు. ఊరారా ఇప్పటికే వేడుక వాతావరణం నెలకొంది. మహానగరం హైదరాబాద్ కూడా కొత్త మూడ్ లోకి వెళ్లిపోయింది. ప్రజల ఉత్సాహానికి మరింత ఊపునిచ్చేలా రవాణా సంస్థలూ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. జనం కూడా తమవైన డిమాండ్లను తెరపైకి తెచ్చారు.
డ్రంకెన్ డ్రైవ్లో దొరికితే రూ.10వేలు ఫైన్: మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
మద్యం ప్రియులారా.. రారండి..
డిసెంబర్ 31 వేడుకలకు సిద్ధమైన మహానగరంలో మెజార్టీ సెలబ్రేషన్స్ మందుతోనే జరుగుతాయని వేరే చెప్పనక్కర్లేదు. దోస్తులతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నవాళ్లు అర్ధరాత్రి వేళ ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా.. మెట్రో రైల్ బంపర్ ఆపర్ ను ప్రకటించింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా.. అంటే రాత్రి1 :30వరకూ సర్వీసులు నడుపుతామన్న మెట్రో అధికారులు.. రైళ్లలోకి మందు తాగిన వాళ్లను కూడా అనుమతిస్తామని ప్రకటించింది.
కండిషన్స్ అప్లై..
సాధారణంగా మద్యం సేవించినవాళ్లను మెట్రో రైళ్లలోకి ఎక్కనివ్వరు. కేవలం న్యూ ఇయర్ వేడుకల సందర్భంగానే మందుబాబులకు కూడా ప్రయాణానికి పర్మిషన్ ఇచ్చారు మెట్రో అధికారులు. అయితే మందుతాగినంత మాత్రన తోటి ప్రయాణికులతో అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించొద్దని, ఒకవేళ అలా చేస్తే రైలు దిగిపోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఎంఎంటీఎస్ టైమింగ్స్ మారాయి..
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి-ఫలక్ నుమా రూట్ లో రాత్రి 1 :30 వరకు.. లింగంపల్లి-హైదరాబాద్ రూట్ లో రాత్రి 1 :15 వరకు సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు. ఈ మేరకు అవసరమైన చర్యల్ని తీసుకున్నామని, సిటీ వాసులు ఎంఎంటీఎస్ సేవల్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఎత్తేస్తే సరి!
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబులకు అనుమతిస్తున్నట్లు మెట్రో రైల్ అధికారులు ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. అవును.. మీరు ఊహించిదే.. ఆ డిమాండ్ డ్రంకెన్ డ్రైవ్ గురించే! మెట్రో అధికారులు మందుబాబులకు పర్మిషన్ ఇచ్చినట్లే.. ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ ఒక్కరోజు డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్స్ నిలిపేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏం చేస్తాం.. అసలే హైదరాబాద్ పోలీసులు.. వాళ్ల దగ్గరా మనవేషాలు!!
జనవరి నుంచి మంత్లీ పాస్లు
కొత్త సంవత్సరం సందర్భంగా మెట్రో రైలు ప్రయాణికులకు మరో ఆపర్ కూడా లభించనుంది. 2020 జనవరి నుంచే నెలవారీ పాసుల విధానం అమల్లోకి రానుంది. జెబిఎస్-ఎంజిబిఎస్ కారిడార్ లో సర్వీసులు మొదలైన వెంటనే మంత్లీ పాస్ ల జారీ చేపడతామని మెట్రో అధికారులు పేర్కొన్నారు. పాసులకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు.