హైదరాబాద్ మెట్రో తప్పిదం..? ఒకే ట్రాక్ మీద రెండు రైళ్లు.. తప్పిన ప్రమాదం!!
Recommended Video
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే మెట్రో ట్రాక్ మారింది. ఒక ట్రాక్లో వెళ్లాల్సిన మెట్రో రైలు మరో ట్రాక్లోకి వెళ్లింది. అయితే పొరపాటును గుర్తించిన అధికారులు మరో ట్రాక్లో ఎలాంటి రైళ్లు రాకుండా కంట్రోల్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో మెట్రో రైలులో 400 మంది ప్యాసింజర్లు ఉన్నారు.
ప్రమాదంను గుర్తించిన అధికారులు మెట్రో రైలును లక్డీకపూల్కు రప్పించారు. అక్కడ ప్రయాణికులందరిని దించివేశారు. అనంతరం దాన్ని తిరిగి వెనక్కు పంపించారు. అయితే మెట్రో రైలు పూర్తిగా నాగోల్లోని కంట్రోల్ రూం నుంచి ఆటోమేషన్ వ్యవస్థ ద్వారా నడుస్తుంది. ఒక్కసారిగా ఆ రైలు రాంగ్ రూట్లోకి వెళ్లడంతో అప్పటి వరకు లోపలున్న ప్రయాణికులకు ఏమి జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత రైలు వెనక్కు వెళుతున్న సమయంలో ట్రైన్ లోపల గందరగోళ పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు రాంగ్ రూట్ వెళ్లడంతో కాసేపు మెట్రో సేవలను నిలిపివేశారు అధికారులు.
సాంకేతిక కారణాలతో హైదరాబాద్ మెట్రో రైలు కొన్ని నెలల కితం నిలిచిపోయింది. అయితే ఇలా రాంగ్ రూట్లో అంటే ట్రాక్ మారి ప్రయాణించడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. అసలు రైలు ట్రాక్ ఎలామారిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశించారు.