Hyderabd Metro: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ - భారీ రిలీఫ్..!!
Underground Metro In Hyderabad: హైదరాబాద్ ప్రజలకు రిలీఫ్ ఇచ్చే వార్త. నిత్యం ట్రాఫిక్ కష్టాల్లో నలిగిపోతున్న నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో కొత్త నిర్ణయం ప్రకటించింది. ఇప్పటికే మెట్రో సేవలు భారీ స్థాయి లో విస్తరించినా..రద్దీ మాత్రం తగ్గటం లేదు. అదే సమయంలో రోడ్ల పైన వాహనాల క్యూలు తప్పటం లేదు. దీంతో, ఇప్పుడు తొలి సారిగా హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ మెట్రో విస్తరణకు నిర్ణయించారు. దీని ద్వారా ఇతర మెట్రో నగరాల తరహాలో హైదరాబాద్ మెట్రో స్థాయి పెరగనుంది. నగర ప్రజలకు ట్రాఫిక్..ప్రయాణాల కష్టాల నుంచి రిలీఫ్ దక్కనుంది.
నగరంలో తొలి భూగర్భ మెట్రో..
హైదరాబాద్ నగరంలో తొలి భూగర్భ మెట్రో రానుంది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది. మొత్తం 31 కిమీ మేర మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా శంషాబాద్లోని మెట్రోకారిడార్ విమానాశ్రయం సమీపంలో 2.5 కిమీ మేర అండర్గ్రౌండ్ మెట్రోను ఏర్పాటు చేయనున్నట్లు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు మెట్రోకారిడార్ నిర్మాణం కోసం రూ. 6250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఈ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని మెట్రో ఎండీ వివరించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ దీని పైన స్పష్టత ఇచ్చారు.
ఏయిర్ పోర్టు నుంచి మెట్రో కనెక్టివిటీ..
తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు రాయదుర్గం - శంషాబాద్ మెట్రోకు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అటు శంషాబాద్ లో పెరుగుతున్న ప్రయాణీకుల సామర్ధ్యం మేర నగరానికి కనెక్టవిటీ పెంచేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయానికి ప్యాసింజర్ల రద్దీ పెరగింది. ఏయిర్ పోర్టులో ఒక్కో విభాగాన్ని గతం కంటే రెండింతల స్థాయిలో పెంచుతున్నారు. ప్రస్తుతం 35 మిలియన్ మంది ప్రయాణీకులకు వీలుగా సౌకర్యాలు విస్తరిస్తున్నారు. దీంతో.. ఎంతో కాలంగా శంషాబాద్ నుంచి మెట్రో సేవలను విస్తరించాలనే డిమాండ్ ఇప్పుడు ఆచరణలోకి రానుంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఇక, తాజాగా అదే ప్రణాళికల్లో భాగంగా భూగర్భ మెట్రో ద్వారా హైదరాబాద్ లో మరింత సౌకర్య వంతంగా మారనుంది.
హైదరాబాద్ మెట్రోకు పెరిగిన డిమాండ్..
హైదరాబాద్ నగరంలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తరువాత అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ ప్రజానీకం మెట్రో ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు కేరిడార్లలో 69.2 కిలో మీటర్ల మేర మెట్రో అందుబాటులో ఉంది. ఉదయం..సాయంత్ర వేళ అన్ని రూట్లలోనూ మెట్రో ప్రయాణీకులతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మెట్రో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ అయిదేళ్ల కాలంలో ఇప్పటి వరకు మెట్రోలో 31 కోట్ల మంది ప్రయాణించారు. దీని ద్వారా.. నగర వాసులు ఏ స్థాయిలో మెట్రోకు ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టం అవుతోంది. దీని ద్వారా అటు శంషాబాద్ తో పాటుగా .. పాత బస్తీ నుంచి కూడా కనెక్టివిటీ పెరిగేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.