కరోనా దారుణం: హైదరాబాద్ రోడ్డుపై శవం.. జేబులో వైరస్ టెస్టుల స్లిప్పు.. సిటీలో షాకింగ్ ఘటన
గడ్డు రోజులు గడుస్తున్నకొద్దీ కరోనా వైరస్ కు సబంధించి అనూహ్య సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ లోని నారాయణగూడ ప్రాంతంలో ఓ వ్యక్తి రోడ్డుపైనే చనిపోయి ఉండటం.. లాక్ డౌన్ కారణంగా దాన్నెవరూ గుర్తించలేకపోవడం.. తీరా అక్కడికి చేరుకున్న పోలీసులకు అతని జేబులో కొవిడ్-19 టెస్టుల కాగితాలు కనిపించడం.. ఆ శవాన్ని తరలించడంలోనూ విపరీతమైన జాప్యం నెలకొనడం సిటీలో సంచలనంగా మారింది. నారాయణగూడ ఇన్ స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి మీడియాకు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
అసలేం జరిగిందంటే..
షేర్ బహదూర్(77) అనే వ్యక్తి సిటీలోని లాలాపేటలో నివసిస్తున్నాడు. అతను నేపాల్ నుంచి వచ్చిన వలసకూలీ. లాక్ డౌన్ తర్వాత పనిలేక ఇంట్లోనే ఉండిపోయాడు. నాలుగు రోజుల కిందట జలుబు, జ్వరం రావడంతో స్థానిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లాడు. అక్కడి వైద్య సిబ్బంది.. అతణ్ని.. కింగ్ కోఠి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంబులెన్స్ లో కింగ్ కోఠికి చేరుకున్నాక.. రెండో సారి కూడా టెస్టులు నిర్వహించారు. అక్కణ్నుంచి అతణ్ని గాంధీ(కరోనా) ఆస్పత్రికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ అంతలోపే..
లిస్టులో పేరున్నా..
కింగ్ కోఠి ఆస్పత్రిలో కొవిడ్-19 టెస్టుల తర్వాత.. అంబులెన్స్ కోసం బయట వెయిట్ చేయాలని సిబ్బంది సూచించారు. కానీ, బహదూర్ మాత్రం ఆ స్లిప్పుల్ని జేబులో పెట్టుకుని ఎవరికీ చెప్పకుండా బయటికి నడిచాడు. పేషెంట్ల లిస్టులో పేరున్నటికీ బహదూర్ ఏమైపోయాడన్న సంగతిని వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. అలా బయటికెళ్లిన పేషెంట్.. నారాయణగూడ వైపు నడుచుకుంటూ వెళ్లి, వైఎంసీఏ క్రాస్ రోడ్డు పక్కన పడిపోయాడు. అసలతను తప్పిపోయాడన్న విషయాన్ని పోలీసులు కనిపెట్టి చెప్పేదాకా కింగ్ కోఠీ ఆస్పత్రి సిబ్బంది గుర్తించకపోవడం గమనార్హం.
ప్లాస్టిక్ కవర్లలో చుట్టి..
లాక్ డౌన్ కారణంగా రోడ్లపైకి ఎవరూ రాకపోవడంతో చాలా సేపు బహదూర్ ను ఎవరూ గుర్తించలేదు. శుక్రవారం సాయంత్రం స్థానికులు ఫోన్ చేయడంతో పోలీసులకు విషయం తెలిసింది. ఇన్ స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి పరిశీలించగా, అప్పటికే బహదూర్ చనిపోయాడు. జేబులో కొవిడ్-19 టెస్టులకు సంబంధించిన పేపర్లున్నాయి. శవాన్ని తరలించే విషయమై వైద్య సిబ్బందికి, జీహెచ్ ఎంసీకి ఫోన్ చేసినా సరైన రెస్పాన్స్ రాలేదని పోలీసులు చెప్పారు. కుక్కలు దాడిచేసే అవకాశం ఉండటంతో.. పోలీసులే ప్లాస్టిక్ కవర్లు తెచ్చి, మృతదేహాన్ని అందులో భద్రపర్చారు. వంద మీటర్ల దూరంలో నిలబడి ఇద్దరు కానిస్టేబుళ్లు రాత్రాంతా కాపలాకాశారు.
పోలీసులు చెప్పేదాకా..
తర్వాతి రోజు తెల్లవారుజామున అంబులెన్స్ రావడంతో బహదూర్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మృతుడు బహదూర్.. కింగ్ కోఠి ఆస్పత్రి నుంచి బయటికి వచ్చినట్లు నిర్ధారించుకుని పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పుడుగానీ పేషెంట్ తప్పిపోయిన విషయాన్ని వైద్య సిబ్బంది గుర్తించలేకపోయారు. మెల్లగా తేరుకున్న సిబ్బంది.. మృతుడు నివసించిన ఏరియా వివరాలు, అతను ఆస్పత్రిదాకా ఎలా వచ్చాడు, అంతకుముందు ఎవరెవర్ని కలిశాడనే విషయాలను ఆరా తీస్తున్నారు. నారాయణగూడ పోలీసులు నిర్ధారించిన ఈ ఘటనపై వైద్య శాఖ ఉన్నతాధికారులు స్పందించలేదు.
Recommended Video