ముంబై డ్రీమ్ నెరవేర్చుకునేందుకు... హైదరాబాద్లో పసిబిడ్డను అమ్మేసిన తల్లి... ఇలా వెలుగులోకి...
ఆమె వయసు 22 ఏళ్లు. ఓ పసిబిడ్డకు తల్లి. భర్తతో విబేధాల కారణంగా అతనితో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఆమెను చుట్టుముట్టాయి. పైగా ముంబై వెళ్లాలన్న ఓ కోరిక ఆమెను వెంటాడుతుండేది. వీటన్నింటికీ ఒకే పరిష్కారం అని భావించింది. చంటి పిల్లాడిని ఎవరికైనా అమ్మేసి.. ఆ డబ్బుతో తన అవసరాలు తీర్చుకోవాలనుకుంది. అనుకున్నట్లుగానే ఒకరితో డీల్ కూడా కుదిరింది. కానీ ఇంతలోనే విషయం పోలీసులకు తెలియడంతో ఆమెతో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అసలేం జరిగింది...
హైదరాబాద్లోని నాంపల్లి సుభాన్పూర్కి చెందిన జోయా ఖాన్(22) కొద్ది నెలల క్రితం బాబుకు జన్మనిచ్చింది. అయితే భర్తతో విభేదాల కారణంగా అతనితో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఉద్యోగం లేకపోవడం,ఎవరి వైపు నుంచి ఏ సహాయం అందకపోవడంతో బాబును పోషించడం ఆమెకు కష్టంగా మారింది. పైగా ఎప్పటినుంచో ఆమెకు ముంబై వెళ్లాలన్న ఓ కోరిక ఉంది. దీంతో బాబును ఎవరికైనా అమ్మి... ఆ డబ్బుతో తన అవసరాలు తీర్చుకోవాలని భావించింది.
ఇలా డీల్....
చంచల్గూడాకి చెందిన అయేషా జబీన్(28) అనే గృహిణితో జోయా ఖాన్ రూ.45వేలకు ఒప్పందం కుదుర్చుకుని బాబును అమ్మేసింది. జబీన్ తల్లి షమీమ్ బేగం(50),షమీమ్ సోదరి సిరాజ్ బేగం(51) మధ్యవర్తులు ఎస్కే మహమ్మద్ (30),అతని భార్య తబస్సుమ్(25) ఇందుకు సహకరించారు. అగస్టు 11న దీనిపై హబీబ్ నగర్ పోలీసులకు జోయా ఖాన్ భర్త అబ్దుల్ ముజాహిద్(29) అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సుభాన్పురాలోని దారువాలా బార్&రెస్టారెంట్లో అతను మేనేజర్గా పనిచేస్తున్నాడు.
భర్త ఫిర్యాదుతో వెలుగులోకి...
రెండు నెలల తమ బాబును తన భార్య జోయా ఖాన్.. మహమ్మద్,తబస్సుమ్ బేగమ్లకు విక్రయించినట్లు అబ్దుల్ ముజాహిద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు జోయాను అరెస్ట్ చేసి విచారించగా... ఆమె నేరం అంగీకరించింది. దీనిపై హబీబ్ నగర్ ఇన్స్పెక్టర్ శివచంద్ర మాట్లాడుతూ... ' అగస్టు 3న ముజాహిద్,అతని భార్య జోయాలకు ఏదో చిన్న విషయంలో గొడవ తలెత్తింది. దీంతో ముజాహిద్ భార్య జోయా,కుమారుడిని వదిలేసి ఎంఎస్ మక్తాలోని తన తల్లిదండ్రులు ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో జోయా తీవ్ర మనస్తాపం చెందింది. కొడుకును పోషించేందుకు తన వద్ద డబ్బు లేకపోవడంతో ఆ పసిబాబును అమ్మేయాలని నిర్ణయించుకుంది.' అని తెలిపారు.
Recommended Video
ముంబై డ్రీమ్...?
జోయా ఖాన్తో పాటు అయేషా జబీన్,షమీమ్ బేగం,సిరాజ్ బేగం,ఎస్కే మహమ్మద్,తబస్సుమ్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. వారిపై జువైనల్ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జోయా అరెస్ట్ అనంతరం ఆ శిశువును అతని భర్త ముజాహిద్కు అప్పగించారు.జోయా ఖాన్ ముంబై డ్రీమ్ గురించి పోలీసులు ఎక్కడా వెల్లడించనప్పటికీ... కొడుకును అమ్మేయడానికి అది కూడా ఒక కారణమని కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి.