నేరెడ్మెట్లో మిస్సింగ్ బాలిక మృతదేహం లభ్యం: సైకిల్తో సహా డ్రైనేజీలో కొట్టుకుపోయి
హైదరాబాద్: హైదరాబాద్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు ఓ బాలికను బలి తీసుకున్నాయి. సైకిల్పై బయటికి వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక మృతదేహం డ్రైనేజీలో లభించింది. గురువారం అదృశ్యమైన బాలిక మృతదేహం ఈ మధ్యాహ్నం బండచెరువు వద్ద గుర్తించారు. తన ఇంటి వద్ద నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఆ బాలిక డ్రైనేజీలో కొట్టుకునిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె మృతదేహం లభించడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఆ బాలిక పేరు సుమేధా కపూరియా. అయిదో తరగతి విద్యార్థిని. హైదరాబాద్ నేరెడ్మెట్లోని దీన్దయాళ్ నగర్లో నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం సైకిల్పై ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్లారు. చివరిసారిగా ఆమె కాకతీయ నగర్లో సైకిల్పై వెళ్తూ కనిపించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో లభించాయి.
ఎంతసేపయినప్పటికీ.. తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ నరసింహ స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాత్రంతా గాలించినప్పటికీ.. బాలిక ఆచూకీ తెలియరాలేదు. ఈ ఉదయం కూడా బాలిక కోసం గాలింపు చర్యలను చేపట్టారు. కాకతీయ నగర్లో సైకిల్ వెళ్తున్నట్లు కనిపించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బందిని రంగంలోకి దించారు.
కొన్ని చోట్ల డ్రైనేజీకి మూత లేకపోవడం వల్ల అందులో పడి ఉండొచ్చనే అనుమానంతో అడుగడుగునా గాలించారు. తొలుత- దీన్దయాళ్ నగర్ సమీపంలోని బండచెరువు వద్ద సుమేధ సైకిల్ను గుర్తించారు. డ్రైనేజీ నుంచి కొట్టుకుని రావడంతో చెత్తా చెదారం సైకిల్పై నిండిపోయింది. సైకిల్ కనిపించిన ప్రదేశంలో గాలించగా.. సుమేధా మృతదేహం లభించింది. ప్రాణాలతో తిరిగి వస్తుందనే ఆశతో ఉన్న తల్లిదండ్రులు.. తమ కుమార్తె మరణవార్త విని హతాశులయ్యారు.
కాకతీయ నగర్, దీన్దయాళ్ నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. మురుగునీటి కాల్వపై అమర్చిన కాంక్రీట్ మూతలు చాలాచోట్ల పగిలిపోయి ఉన్నాయని, వాటిని బాగు చేయాలంటూ తాము పలుమార్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. పట్టించుకోలేదని, ఫలితంగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్నాయనే విషయం తెలిసినప్పటికీ.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు.